- Home
- Andhra Pradesh
- Weather Update: రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హైఅలర్ట్
Weather Update: రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హైఅలర్ట్
Weather Update: నైరుతీ రుతుపవనాల విస్తరణ, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 6 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

రుతుపవనాల ఎంట్రీ : ఏపీ, తెలంగాణకు నెక్స్ట్ 6 రోజులు వానలే వానలు
వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ కేరళను తాకిన కొన్ని రోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాల వైపు దూసుకొచ్చాయి. ప్రస్తుతం ఇవి రాయలసీమలో సగం ప్రాంతానికి, అలాగే దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి.
అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక గాలి పరిస్థితుల వల్ల ఈ రుతుపవన గాలులు ఏపీ దాకా వచ్చి, తమిళనాడు వైపు టర్న్ తీసుకుంటున్నాయి. దీనివల్ల హైదరాబాద్, మధ్య తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రుతుపవనాలు పూర్తిగా చేరడానికి మరో 4 రోజుల టైమ్ పట్టేలా ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతం గాలుల వేగం పెరగడం సానుకూల అంశమని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది.
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్
రుతుపవనాలు ఇంకా పూర్తిగా విస్తరించకపోయినా.. లక్షద్వీప్ నుంచి వచ్చిన మేఘాల వల్ల ఇప్పటికే వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, ఏపీపై ఒక బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సముద్రమట్టం నుంచి దాదాపు 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన మేఘాలు కమ్మేశాయి.
దీనివల్ల జూన్ 10 నుంచి 15 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా జూన్ 10న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడే అవకాశం ఉందని ఐఎండీ హైఅలర్ట్ జారీ చేసింది.
ఏపీ వాతావరణం: ఒకవైపు భారీ వానలు.. మరోవైపు మండుతున్న ఎండలు
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, శాటిలైట్ డేటా ప్రకారం రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. రోజంతా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడుతూనే ఉంటాయి. ఉత్తరాంధ్రలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం వేళ పెద్ద వర్షమే కురవనుంది. అటు రాత్రి 11 గంటల సమయంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉంది.
అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఇదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల 41 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రికార్డు కానున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారుతున్న వాతావరణం
తెలంగాణలో వాతావరణం చాలా విచిత్రంగా మారుతోంది. జూన్ 9న హైదరాబాద్లో ఊహించని విధంగా సడెన్ గా భారీ వర్షం ముంచెత్తింది. జూన్ 10న పగటిపూట ఎండల ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉన్నా, మధ్యాహ్నం తర్వాత మేఘాలు క్రమంగా పెరుగుతాయి. ఖమ్మం, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.
ఇక సాయంత్రానికి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో, అలాగే దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడతాయి. ఈ సమయంలో గంటకు 33 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి, తేమ శాతం 45 గా నమోదవుతుంది. రాబోయే 5 రోజులు తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి కంటిన్యూ కానుంది.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
ప్రస్తుతం అరేబియా సముద్రం నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు తెలుగు రాష్ట్రాల్లోక దూసుకొస్తున్నాయి. వీటికి బలమైన 'క్యుములోనింబస్' మేఘాలు తోడయ్యాయి. వాన కొద్దిసేపే పడినా.. ఈదురుగాలుల బీభత్సం చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ గాలుల ధాటికి కరెంట్ తీగలు తెగిపడటం, చెట్లు, హోర్డింగులు కూలిపోవడం జరుగుతోంది.
అందుకే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ప్రజలకు కీలక సూచనలు చేసింది. వర్షం పడేటప్పుడు ఎవరూ శిథిలమైన ఇళ్ళు, పాత గోడలు, చెట్లు, కరెంట్ స్తంభాల కింద వుండొద్దు. ముఖ్యంగా పిల్లలను బయటకు పంపించవద్దు. అటు మధ్య బంగాళాఖాతంలో గాలి వేగం 67 కిలోమీటర్లుగా ఉన్నందున, మత్స్యకారులు మరో నాలుగు రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

