- Home
- Andhra Pradesh
- Prashna Ravan Controversy: యూట్యూబర్ రావణ్ కేసులో మరో ట్విస్ట్...దర్యాప్తులో బయటపడ్డ సెల్ ఫోన్ డేటా
Prashna Ravan Controversy: యూట్యూబర్ రావణ్ కేసులో మరో ట్విస్ట్...దర్యాప్తులో బయటపడ్డ సెల్ ఫోన్ డేటా
Prashna Ravan Controversy: యూట్యూబర్ రావణ్ కేసులో ఫోరెన్సిక్ నివేదికతో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. డిలీట్ చేసిన మొబైల్ డేటాను రికవరీ చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రావణ్ కేసులో దర్యాప్తు మరో ట్విస్ట్
వివాదాస్పద వీడియోలు, సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో దర్యాప్తు మరో ట్విస్ట్ బయటపడింది. ఆయన మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ నిపుణులు మళ్లీ బ్యాకప్ చేయడంతో కీలక అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న ఫోన్ను పరిశీలించినప్పుడు అందులోని కొన్ని ఫైళ్లు ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రత్యేక ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆ ఫోన్ ను ల్యాబ్ కు పంపించారు. అయితే తాజాగా అందిన నివేదికలో డిలీట్ చేసిన డేటాలో కొన్ని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ రికార్డులు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
రావణ్పై మరో కేసు కూడా నమోదు
ప్రాథమిక సమాచారం ప్రకారం, పలువురు యువతులతో పరిచయం పెంచుకుని, వారి వ్యక్తిగత డిజిటల్ కంటెంట్ను సేకరించి, వాటితో బెదిరించారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు పది మంది వరకు బాధితులను గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. మరికొందరు బాధితులు ఉండే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఇదే సమయంలో రావణ్పై మరో కేసు కూడా నమోదైంది. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు.
దర్యాప్తు పూర్తయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం
ఇప్పటికే పిఠాపురం, కాకినాడ ప్రాంతాల్లో నమోదైన కేసుల నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది.
ఫోరెన్సిక్ నివేదికలో లభించిన డిజిటల్ ఆధారాల ఆధారంగా బాధితుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు, కేసుకు సంబంధించిన ఇతర ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

