Asianet News TeluguAsianet News Telugu

కెల్విన్ తో ఉన్న ఆ పరిచయమే, డ్రగ్స్ ఆరోపణలకు కారణమైంది.. విచారణ అనంతరం తనీష్!

విచారణ అనంతరం స్పందించిన తనీష్, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అన్నారు. కెల్విన్‌ నుంచి తాను డ్రగ్స్‌ ఖరీదు చేయడం కానీ, ఆర్ధిక సాయానికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

tollywood drugs case tanish interacted with media after ed inquiry
Author
Hyderabad, First Published Sep 18, 2021, 10:38 AM IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వరుసగా టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తున్నారు.సెప్టెంబర్ 17 శుక్రవారం డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో తనీష్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 6 గంటలకు వరకు, దాదాపు ఏడున్నర గంటల విచారణ ఎదుర్కొన్నారు.

విచారణ అనంతరం స్పందించిన తనీష్, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అన్నారు. కెల్విన్‌ నుంచి తాను డ్రగ్స్‌ ఖరీదు చేయడం కానీ, ఆర్ధిక సాయానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో ఉన్న పరిచయం, అతడితో లావాదేవీలపై తనీష్‌ను ఈడీ అధికారులు ఆరా తీశారు. 2016–17 మధ్య కెల్విన్‌తో వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో తాను చేసిన పలు సినిమాలకు కెల్విన్‌ ఈవెంట్లు నిర్వహించాడని, ఆ విధంగానే అతడితో పరిచయం ఏర్పడిందని తనీష్‌ జవాబిచ్చారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్‌ క్రయవిక్రయాలు, వినియోగానికి ఎక్కడా తావు లేదని స్పష్టం చేశారు. కెల్విన్‌ విచారణలో తన పేరు బయటకు రావడానికి అతడితో ఈవెంట్ల పరంగా ఉన్న పరిచయమే కారణమని వివరణ ఇచ్చారు. 


విచారణ ముగించుకుని తిరిగి వెళ్తూ తనీష్ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులను కోరిన వివరాలు అందించానని, వారు కొన్ని డాక్యుమెంట్లు సైతం పరిశీలించారని తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సిన అవసరం ఉంటుందని చెప్పలేదని, ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వచ్చి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కాగా వచ్చే బుధవారం నటుడు తరుణ్‌ విచారణకు హాజరుకానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios