'దిశ' సినిమా: పిటిషన్ పై వర్మ స్పందనలో నిజమెంత?
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు వర్మ. అయితే సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.రిలీజ్ ను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.
యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా సంఘటన.. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు వర్మ. అయితే సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.రిలీజ్ ను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'దిశ' సినిమాపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాను ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నానని... నిర్భయ రేప్ తర్వాత జరిగిన అనేక కేసుల ఆధారంగా ఒక ఊహాజనిత కథను తాను సినిమాగా తీస్తున్నానని వర్మ ట్వీట్ చేశాడు. అయితే ఇందులో నిజమెంత...ఇది ఊహాజనిత కథ అయితే దిశను పోలి ఉండేలా ట్రైలర్ ఎందుకు వదిలారని సోషల్ మీడియా జనం ప్రశ్నిస్తున్నారు.
దిశా తండ్రి మాట్లాడుతూ.. ఈ సినిమాని తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని అన్నారు. అంతేకాకుండా యూట్యూబ్లో ఉన్న ట్రైలర్ను వెంటనే తొలగించాలని అయన కోరారు. తమ కుటుంబం అనేక సమస్యలతో బాధపడుతుంటే ఇంకా సినిమా తీసి తమను మరింత కుంగదీయొద్దని అయన ఆవేదనని వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు వర్మను సమాజం నుంచి వెలివేయాలని అయన మీడియాతో అన్నారు.. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకి కూడా వెళ్తామని దిశా తండ్రి వెల్లడించారు.
దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరఫు న్యాయవాది నివేదించారు.
ఈ నేపథ్యంలో నిర్మాత నట్టికుమార్ స్పందించారు. దిశ బయోపిక్ని తీయడం లేదని, మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్లీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
గతేడాది నవంబర్ 26న నలుగురు నిందితులు ఓ యువతిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై అత్యాచారం చేసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ ఘటనపై సినిమా తీస్తానని వర్మ ప్రకటించారు. అంతే కాకుండా దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు భార్యను కలిశారు. అదేవిధంగా శంషాబాద్ పోలీసులను కూడా కలుసుకున్నారు. ఆ కేసు గురించి పూర్తి వివరాలు సేకరించిన వర్మ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి చేశాడు.