సామాజిక బాధ్యత నెరవేర్చిన నభా నటేష్,ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరింది
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ లో పాల్గొని సామాజిక బాధ్యత నెరవేర్చారు. తనకు ఎవరూ ఛాలెంజ్ విసరకపోయినా...స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
టాలీవుడ్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత ఆదరణ దక్కించుకుంది. మహేష్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేయడంతో పాటు మరికొందరు స్టార్స్ కి ఛాలెంజ్ విసిరి, మరింత ప్రాచుర్యం కల్పించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టారు.
తాజాగా హీరోయిన్ నభా నటేష్ దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఛాలెంజ్ ను స్వీకరించి బెంగళూరు లోని తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు పచ్చదనం పెంచడం కోసం చాలా చక్కని ఛాలెంజ్ ను చేపట్టారని దీనిని చూసి నేను స్ఫూర్తి పొంది మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.
అదేవిధంగా ఈ చాలెంజ్ కొనసాగాలని అందుకోసం నేను హీరోయిన్లు అనూ ఇమాన్యుల్,నిధి అగర్వాల్,హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం నభా నటేష్ రెండు తెలుగు చిత్రాలలో నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్, సాయి ధరమ్ సరసన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలలో ఆమె నటిస్తున్నారు.