ఆమె ఆరోపణలు అవాస్తవం...అప్పుడు అనురాగ్ షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లారు..!
హీరోయిన్ పాయల్ ఘోష్ పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ విచారణకు హాజరుకావడం జరిగింది. విచారణ అనంతరం అనురాగ్ లాయర్ వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం సమసిపోయిందనగా హీరోయిన్ పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఆరోణలతో మరలా వెలుగులోకి తెచ్చారు. దర్శకుడు అనురాగ్ తనపై లైంగిక దాడికి యత్నించాడని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసింది. పాయల్ కంప్లైంట్ అందుకున్న అధికారులు అనురాగ్ పై విచారణ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అనురాగ్ అక్టోబర్ 1న అధికారుల విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు అనురాగ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది.
కాగా అనురాగ్ తరపు లాయర్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. పాయల్ ఘోష్ ఆరోపణలు అవాస్తవం అని చెప్పిన అనురాగ్, తన స్టేట్మెంట్ ధ్రువ పరిచేలా ఆధారాలు సమర్పించారు. పాయల్ పై తాను 2013లో లైంగిక దాడికి పాల్పడినట్లు చెవుతుండగా, ఆ సమయంలో ఓ మూవీ షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లానని చెప్పారు. పాయల్ చేసిన ప్రతి ఆరోపణకు అనురాగ్ వివరణ ఇచ్చారు.
ఈ ఘటన కారణంగా అనురాగ్ వ్యక్తిత్వం దెబ్బతినేలా ప్రచారం జరిగింది. ఐతే అనురాగ్ ఇవ్వన్నీ ఉద్దేశపూర్వక, తప్పుడు ఆరోపణలు అని బహిర్గతం అవుతాయని విశ్వాసంతో ఉన్నారు. అనురాగ్ దగ్గర ఉన్న ఆధారాలు, పాయల్ నిలకడలేని ఆరోపణలు ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని రుజువు చేస్తాయి. నిరాధారమైన ఆరోపణలకు అనురాగ్ మరియు ఆయన కుటుంబం, అభిమానులు మానసిక వేదనకు గురవుతున్నారు.
ఈ కేసు విషయంలో అనురాగ్ తనకు అందుబాటులో ఉన్న అన్నిరకాల న్యాయపరమైన మార్గాల అన్వేషణలో ఉన్నారు. అలాగే తనపై లైంగిక ఆరోపణలు చేసిన పాయల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు, అని సదరు లాయర్ ఓ సుధీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు.