Asianet News TeluguAsianet News Telugu

రాయలసీమ ఆత్మగౌరవంతో పులకించిందీ రోజే

ceded districts named rayalaseema on this day in 1928 in Nandyal

ఆంధ్రపాలకులు మరిచిన ఘనచరిత్ర మన రాయలసీమ.

రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాధ కాదు. 1800 సంవత్సరం ముందు, తర్వాత నైజాం ఆధీనంలోకి వెల్లిన తర్వాతనే నాటి నిజాం,ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల వ్యవస్థ తోనే రాయలసీమ కరువు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా  ఈ ప్రాంతం సీడెడ్ ప్రాంతంగా, జిల్లాలు దత్తమండలాలుగా మారాయి. 1928 నవంబర్ 18న ఈ ప్రాంతానికి రాయలసీమ అని నామకరణం చేశారు. అది నంద్యాల ఆంధ్ర మహాసభ సమావేశాలలో జరిగింది. అంటే ఈరోజు రాయలసీమ పుట్టిన రోజు.  

చరిత్రలోకి వెలితే.....

1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసి తంగడి యుద్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం, వరుస దాడుల కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ద భయంతో ఉన్న నిజాము ఆంగ్లేయులతో సైనిక సహకారం ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహరం ఇవ్వలేని నిజాము సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేసినారు. ఆ మొత్తం వ్యవహరంలో సీమ ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా పాలేగాళ్ల ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంభంలో ఆంగ్లేయులకు పాలేగాళ్ల నుంచి ప్రతిఘటన వచ్చింది. బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలేగాళ్లు నిలువలేకపోయినారు. అలా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలేగాళ్లు తొలి స్వతంత్యోద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచినారు. కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్థానం రాయలసీమకు  లభించలేదు. ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీ డె డ్ జిల్లాలుగా పివబడింది. దీన్నే తెలుగు అర్దంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీ డె డ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్థం సరికాదు. వదిలేసుకున్న ప్రాంతం అన్న దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్నలనను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు. అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీ డె డ్ ప్రాంతంగా పిలవబడింది.

నంద్యాల సభలో కీలక నిర్ణయం...

1913 లో ప్రారంభమైన ఆంధ్రమహసభలు 1928న 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశానికి అవకాశం ఇస్తేనే తాము సహకరిస్తామన్న ఈ ప్రాంతనేతల వత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్తమండలం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అధ్యాపకులు, శ్రీకాకులం వాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అన్న ప్రతిపాదనను ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది.

ఘన చరిత్రను అధికారికంగా గుర్తించకపోవడం వెనక కుట్ర

రాయలసీమకు గొప్ప చరిత్ర ఉంది విజయనగర సామ్రాజ్యంలో అభివృద్ది చెందిన ప్రాంతంగా, అన్నమయ్య, వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం సీమ. టి టి డీ తప్ప అన్నమయ్యను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోదు. పప్పూరి తెలుగు ప్రజలు గర్వించదగ్గ దేశభక్తుడు కాని ప్రభుత్వం అధికారికంగా వారి జయంతిని నిర్వహించదు. తొలి స్వతంత్రసమరయోదిడిగా ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి అని తెలుస్తున్నా ఆ వైపుగా ప్రభుత్వం ప్రయత్నం చేయదు. చివరకు దైవ కార్యక్రమము అయిన క్రిష్ణాపుష్కరాలను నది ప్రారంభమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రలో కలిసే దగ్గర నిర్వహిస్తుంది. కారణం శ్రీశైలంలో నిర్వహిస్తే ఈ ప్రాంత ప్రజలు పాల్గొని మన నదిలో పుష్కలంగా నీరు ప్రవహిస్తుంటే రాయలసీమకు నీరు లేకపోవడమేమిటి, మన తర్వాత ఉన్న క్రిష్ణా డెల్టాలో 3 పంటలు పండటం ఏమిటన్న కోపం సీమ ప్రజలలో వస్తుందనే ఉద్దేశం కాదా....... అలా రాయలసీమ ఘనచరిత్ర ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం కారణంగా వెలుగులోకి రాలేక నష్టపోతుంది.

అనుభవాలనుంచి గుణపాఠం నేర్చుకోలేకపోవడం

1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే  ఆంధ్ర ప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో స్థాపించాలని 1926 లో జరిగిన ఆంధ్రమహసభ తీర్మాణం చేసింది.  మద్రాసు శాసనసభ తీర్మానం అయింది. వీటిని ఉల్లంఘించి అనంతలో ఉండాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ అటు పిమ్మట వైజాగ్ తరలించారు. ఆ సంస్దకు తెలివిగా సీమకు చెందిన కట్టమంచిని వైస్ చాన్స్ లర్ గా నియమించి వారితోనే వై జాగ్ లో ఉండటం మంచిదని చెప్పించినారు. అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహన తమకు అండ అనుకుని  వారితో కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాలకే పెద్దమనుషుల ఒప్పందం అంటూ  తెలంగాణతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు. సీమ ప్రజలు కర్నూలు రాజధానిని వదులుకోవలసి వచ్చింది. కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రస్థావించనే లేదు. కాని ముఖ్యమంత్రిగా మాత్రం రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డిని నియమించినారు.

అలా పదవులు సీమకు పనులు మాత్రం సర్కారుకు అన్నట్లు సాగింది ఆ వ్యవహారం. ఆ  పెద్దమనుషుల ఒప్పందం కూడా అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన తెలంగాణ సమాజం రాష్ట్రం కోసం పోరాడి సాధించుకుంది. ఆ సందర్భంలో జరిగిన సమైఖ్య ఉద్యమంలో కీలక సమయం వచ్చినపుడు తప్పటడుగుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ పరిస్థితి ఏమిటి అన్న విషయం వదలి సమైఖ్యమత్తులో మునిగిపోయాము. విడిపోవడం ఖాయం మీకు ఏమికావాలో అడగండి అని కేంద్రం అడిగినా మాకు ఏమీ వద్దు సమైఖ్యమే ముద్దు అన్న నినాదంతో గుడ్డిగా ముందుకు వెల్లినాము. కాని సీమ ప్రజల చేత సమైక్య ఆందోళన చేయించిన సర్కారు పెద్దలు వారు మాత్రం ఆందోళన వదలి డిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి అభివృద్దికి ఉపయోగపడే పోలవరం, రాజధానికి నిధులు. కోస్తా కారిడార్ లాంటి విలువైన విషయాలను చట్టంలో పొందుపరుచుకున్నారు. రాయలసీమ కోసం కనీసం ఒక్కటంటే ఒక్కటి చట్టబద్దంగా చేయించుకోలేకపోయినాము. వివక్షకు పరాకాష్టగా రాజధానిగా అమరావతి ఎంపిక, జివొ నెం 120, క్యాన్స్ ర్ పరిశోధనా కేంద్రం తరలింపు, కండలేరు పథకం రద్దు, నంద్యాలకు ఇస్తామన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు మార్పు, మన్నవరం కుందింపు, చిత్తూరులో ఉన్న శ్రీసిటిని నెల్లూరు పరిధిలోకి మార్చడం ఇలా విభజన తర్వాత సీమ వివక్షకు గురి అవుతూనే ఉన్నది అదికూడా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రాయలసీమవారు ఉన్న సందర్బంలోనే కావడం గమనించాలి.

అందుకే 89 సంవత్సరాల క్రితం అవమానకరంగా పిలుచుకున్న దత్తమండలం నుంచి ఆత్మగౌరవంతో కూడిన రాయలసీమగా మారిన మన సీమ మన ప్రాంత నేతల పదవి వ్యామోహం మూలంగా అధికారంలో ఉన్న పెద్దల వివక్షపూరిత పాలన కారణంగా మరింతగా పతనం కాబడి కువైట్ లో చెన్నై, కేరళలో బిక్షాటన చేసుకునే అవమానకర పరిస్థితి ఎదుర్కొంటున్నాము. వేల మంది రైతులు ఆత్మహత్యలు, లక్షల మంది వలసలు, సీమలో పుడుతున్న 100 మంది పిల్లలలో 45 మంది బలహీనంగా పుతున్నారన్న ఐక్యరాజ్యసమితి గణాంకాలు పాలకుల నుంచి గాని, మన సీమ నేతలనుంచి కానీ కనీస స్పందన ఉండటంలేదు. నేతల తీరుతోబాటు ప్రజలు సైతం కులం, మతం, పార్టీల అబిమానం పేరుతో గుడ్డిగా సమర్దిస్తున్నాము ఫలితం ఒకనాటి రతనాల సీమ నేడు రాళ్లసీమగా మారింది. ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన రాయలసీమ ప్రజల ప్రస్థానం చైతన్యంతో వివక్ష అంతం అయ్యేదాక ఆత్మాభిమానంతో మన జీవితాలు బాగుపడే దాకా పోరాడుతూనే ఉండాలి.

 

* రచయిత రాయలసీమ ప్రాంత మేధావి , ఫోన్ నెం. 9490493436