సారాంశం
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్కు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించాడు. అదే సమయంలో వర్షాల కారణంగా ఆట నిలిచిపోకుండా క్రికెట్ స్టేడియం మొత్తాన్ని పూర్తిగా పైకప్పుతో ఎందుకు కప్పకూడదని చాలా మంది భావించారు.
ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ క్రీడల్లో క్రికెట్ ఒకటి. ఇది పురాతన ఆటలలో ఒకటి. దీనిని ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో ఆడుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ క్రికెట్ ఓ మతమైతే, ఆటగాళ్లు దేవుళ్లు. ఈ క్రేజ్ కారణంగానే బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా విలసిల్లుతోంది. అయితే ఇప్పటికీ, ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్లో పరిష్కరించడం చాలా కష్టంగా అనిపించే కొన్ని రంగాలు ఉన్నాయి. ప్రధానంగా వర్షం కారణంగా ఆట ఎన్నోసార్లు ఆలస్యంగా మొదలుకావడమో లేదంటే రద్దు కావడమో జరిగిన సందర్భాలు కోకోలల్లు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వరుణుడు పలుమార్లు ఆటంకాలు కలిగించాడు.
గుజరాత్లోని అహ్మాదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మే 28న జరగాల్సి వుంది. అయితే వర్షం కారణంగా గ్రౌండ్ కొట్టుకుపోయి.. ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ను సోమవారం రిజర్వ్ డేకు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే రిజర్వ్ డే నాడు కూడా వాతావరణ పరిస్ధితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆకాశం మేఘావృతమై వర్షం పడే అవకాశాలు కనిపించాయి. ఆ సమయంలో క్రికెట్ అభిమానులు వణికిపోయారు. కనీసం ఈరోజైనా మ్యాచ్ జరుగుతుందా..? చెన్నై గెలుస్తుందా.. ? గుజరాత్ గెలుస్తుందా ఇలా మనసులో సవాలక్ష ప్రశ్నలు. అదే సమయంలో వర్షాల కారణంగా ఆట నిలిచిపోకుండా క్రికెట్ స్టేడియం మొత్తాన్ని పూర్తిగా పైకప్పుతో ఎందుకు కప్పకూడదని చాలా మంది భావించారు.
అయితే పూర్తిగా పైకప్పు మూసి క్రికెట్ నిర్వహించకపోవడానికి కొన్ని కారణాలు వున్నాయి. ఇతర క్రీడల మాదిరిగా కాకుండా క్రికెట్ పీచ్ సహజ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. SENA దేశాలలో మాదిరిగా .. వాతావరణ పరిస్ధితులు క్రికెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మరీ ముఖ్యంగా ఉపఖండ దేశాల్లో బంతి గిర్రున తిరుగుతుంది. కానీ మూసి వుంచిన స్టేడియంలో క్రికెట్ ఆడితే ఎండ లేదా మేఘావృతమైనా బంతిలో సహజ కదలిక వుండదు.
దీని వెనుక మరో ప్రధాన కారణం బడ్జెట్. క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటే అయినప్పటికీ, అనేక దేశాలు ఈ క్రీడ పట్ల సానుకూలంగా వున్నప్పటికీ సంబంధిత బోర్డుల వద్ద మైదానం పైకప్పును పూర్తిగా మూసివేసేంత స్థాయిలో డబ్బు లేదు. సాంప్రదాయ క్రికెట్ వేదికలతో పోలిస్తే స్టేడియంను పూర్తిగా మూసివేసేందుకు రెండింతల ఖర్చు అవుతుంది. మరో ముఖ్య కారణం ఏంటంటే..బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ కొట్టిన తర్వాత అది ఎంత ఎత్తుకు వెళ్తుందో ఎవరూ చెప్పలేరు. అది పైకప్పును తాకినట్లయితే.. ఫీల్డర్కు బంతిని పట్టుకోవడం చాలా కష్టం. దీనికి తోడు సహజ సూర్యరశ్మి లేకుండా కృత్రిమ కాంతిలో ఆడటం ఎంతో ఖరీదుతో కూడుకున్నది. అందువల్ల క్రికెట్ మైదానాలను పైకప్పు లేకుండానే నిర్వహిస్తూ వస్తున్నారు.