దివాళా అంచున ‘చిన్న’కంపెనీలు.. బ్యాంకులకు పొంచి ఉన్న ప్రమాదం...
కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల చిన్న కంపెనీలు ‘దివాలా’ ముప్పును ఎదుర్కోనున్నాయని సిబిల్ హెచ్చరించింది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు చెందిన రూ.2.32 లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణ వాయిదాల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం విధించాలని ఆర్బీఐ, కేంద్రాన్ని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరడం గమనార్హం.
ముంబై : కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని రంగాల కంపెనీలూ ఆర్థికంగా చితికి పోతున్నాయి. ఈ లాక్డౌన్తో చిన్న చిన్న వ్యాపార సంస్థల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. కొన్ని సంస్థలైతే దివాలా తీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే అదే జరిగితే వీటి నుంచి బ్యాంకులకు రావలసిన రూ.2.32 లక్షల కోట్ల రుణాలు ‘మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని సిబిల్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఒక నివేదికలో పేర్కొంది.
రూ.10 లక్షల్లోపు రుణాల చెల్లింపులపై తీవ్ర ప్రభావం
ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు రుణం ఉన్న లఘు పరిశ్రమలు తీవ్రంగా కరోనా ప్రభావానికి గురవుతాయని బుధవారం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సిబిల్ పేర్కొంది. రూ.10 లక్షల లోపు రుణం ఉన్న చిన్న సంస్థల మొత్తం రుణ పరిమాణం దాదాపు రూ.93వేల కోట్లయితే, ఇందులో రూ.13,600 కోట్లు మొండిబకాయిల ఖాతాలోకి వెళ్లొచ్చని అంచనావేసింది.
రుణ వాయిదాలపై ఆరు నెలల మారటోరియం కావాలి
ఇదిలా ఉంటే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని కేంద్రం, ఆర్బీఐలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ రంగానికి రుణ బకాయిల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వన్టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్ వంటి చర్యలు చేపట్టాలని కేంద్రానికి, ఆర్బీఐకి ఐబీఏ సిఫారసు చేసింది.
ఎన్బీఎఫ్సీలను ఆదుకోవాలని ఐబీఐ అభ్యర్థనబ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుసహా పలు పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐబీఏ కీలక సిఫారసులు చేసింది. విభిన్న రంగాల నుంచి అందిన అభ్యర్థనలు పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఈ సమగ్రమైన, సవివరమైన సిఫారసులు అందించినట్టు ఐబీఏ తెలిపింది.
అసాధారణ పరిస్థితులకు తగ్గినట్లే అసాధారణ రాయితీలు కావాలి
ప్రస్తుతం దేశంలో ముందెన్నడూ కనివిని ఎరుగని అసాధారణ పరిస్థితి ఉన్నందున దానికి ఊరట కల్పించే చర్యలు కూడా అసాధారణంగానే ఉండాలని ఐబీఏ గత వారం సమావేశంలో తెలిపింది. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కి మననుగడ సాగించేందుకు బ్యాంకులు, పరిశ్రమలకు తగు భద్రత, ఆసరా అందిస్తే పునరుజ్జీవం ప్రారంభం అవుతుందని కూడా ఐబీఏ పేర్కొంది.
పారిశ్రామిక సంఘాల అభ్యర్థన మేరకే
ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణాల పునర్నిర్మాణ పథకం నిషేధించారు. రుణాల ఎగవేత పరిష్కారం.. దివాళా స్మ్రుతి (ఐబీసీ) ప్రకారం జరుగాల్సి ఉంటుంది. కాగా వివిధ పారిశ్రామిక సంఘాల అభ్యర్థనల మేరకు ఎంఎస్ఎంఈలతోపాటు వివిధ రంగాల సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆర్బీఐకి, కేంద్రానికి ఐబీఏ తెలియజేసినట్లు సమాచారం.
‘రిటైల్’పై ఖర్చుల భారం: రాకేశ్ బియానీ
లాక్డౌన్తో రిటల్ వ్యాపార సంస్థల ఖర్చులు 10 నుంచి 35 శాతం వరకు పెరిగి పోయాయి. చిన్న చిన్న రిటైల్ సంస్థలపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద రిటైల్ సంస్థల నిర్వహణ ఖర్చులు 10-15 శాతం పెరిగితే, చిన్న చిన్న రిటైల్ సంస్థల ఖర్చులు మాత్రం 30-35 శాతం పెరిగాయని ఫ్యూచర్ రిటైల్ ఎండీ రాకేశ్ బియానీ చెప్పారు. సామాజిక దూరం, టోకెన్ విధానంతో సహా అనేక నిబంధనలు పాటించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణమన్నారు.