Operation Sindoor: భారత్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ దెబ్బ‌కు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది. 7.2% పతనం కావ‌డంతో ట్రేడింగ్ నిలిపివేశారు. కరాచీ, లాహోర్‌లో డ్రోన్ పుకార్లతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. 

Pakistan stock market to crash and halt: భారత సైన్యం మే 7న 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మిసైల్ దాడులు జ‌రిపింది. భార‌త్ దెబ్బ‌తో ప్రస్తుతం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. KSE-30 సూచీ మే 9న 7.2 శాతం పతనమవడంతో, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX)లో ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం KSE-100 సూచీ ఇప్పటికే 3.13 శాతం పతనమై ఉండగా, గురువారం మరో 6.3 శాతం పడిపోవడంతో ఆటోమేటిక్ సర్క్యూట్ బ్రేకర్లు అమలయ్యాయి. PSX విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఒక్క గంటకు పైగా ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంది. పాక్ కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి చెందిన రీసెర్చ్ విభాగాధిపతి అద్నాన్ షేక్ మాట్లాడుతూ, "కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో డ్రోన్లు కూల్చేశారన్న వార్తలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వార్తలతో పెట్టుబడిదారులు ఆందోళన చెంది విక్రయాలకు పాల్పడ్డారు" అని తెలిపారు. 

ఈ ఉద్రిక్తతల మధ్య లాహోర్‌లో గురువారం ఉదయం జరిగిన పేలుడు పరిస్థితిని మరింత ఉద్రిక్తత వైపు నడిపింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, పాకిస్తాన్ వాయుసేనకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై భారత్ దాడులు జరిపింది. ఇది పాకిస్తాన్ వాయుసేన భారత ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై దాడి యత్నానికి స్పందనగా నిర్వహించిన‌ట్టు పేర్కొంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి అనంతరం భారత ఆర్మీ  ఉగ్ర‌వాదుల‌పై దాడులు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని తెలిపింది.

ఇక పాక్ మార్కెట్‌పై ప్రభావం ఈ ఒక్కరోజుతోనే పరిమితం కాకుండా, ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత KSE-30 సూచీ మొత్తం 14.2 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో మార్కెట్ మరింత ఒత్తిడికి లోనైంది. పాక్ అంతర్జాతీయ బాండ్లు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. 2036లో ముగిసే బాండ్ విలువ 1 సెంటు కంటే ఎక్కువగా పడిపోయి ప్రస్తుతం డాలర్‌కు 73.8 సెంట్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే స‌మ‌యంలో సింగపూర్, ఇజ్రాయిల్, అమెరికా స‌హా చాలా దేశాలు పీవోకే, పాకిస్తాన్ ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేయాలని తమ పౌరులకు సూచించాయి. ఇది కూడా పాకిస్తాన్ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతోంది. 

భారత్ స్టాక్ మార్కెట్లు ఈ ఉద్రిక్తతలకు పెద్దగా ప్రభావితం కాలేదు. నిఫ్టీ 0.5%, సెన్సెక్స్ 0.58% మేరకు మాత్రమే పతనమయ్యాయి. విశ్లేషకుల ప్రకారం, భారత మార్కెట్ బలమైన ఆర్థిక పునరుత్థానం, కార్పొరేట్ లాభాల కారణంగా స్థిరంగా ఉందని అభిప్రాయపడ్డారు. మూడీస్ విశ్లేషణ ప్రకారం, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం పాక్ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. IMF సహాయం లేకుండా పాక్ కు తిరిగి ఆర్థిక స్థిరత్వం దొరకడం కష్టమేనని పేర్కొంది.