India Bans Pakistan origin content: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చెందిన వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు సహా డిజిటల్ కంటెంట్ పై బ్యాన్ విధించింది. భారత్లోని ఓటీటీలు వెంటనే పాకిస్తాన్ కంటెంట్ ను నిలిపేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
India Bans Pakistan origin content: తగ్గేదే లే అంటూ భారత్ పాకిస్తాన్ కు వరుసపెట్టి షాక్ లు ఇస్తూనే ఉంది. భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది. ఆపరేషన్ సింధూతో పాక్ ను దెబ్బకొట్టిన భారత్.. ఇప్పుడు ఆ దేశ డిజిటల్ కంటెంట్ పై నిషేధం విధించింది.
భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఓటీటీ (ఓవర్-ది-టాప్) ప్లాట్ఫార్మ్లు, డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీసులకు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఒక కీలక సూచన జారీ చేసింది. పాకిస్తాన్ మూలాలున్న వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పోడ్కాస్ట్లు, ఇతర డిజిటల్ కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
భారత్ లో పాక్ కంటెంట్ పై బ్యాన్ విధించడం జాతీయ భద్రత దృష్ట్యా తీసుకున్న చర్యగా మంత్రిత్వ శాఖ తెలిపింది. "పాకిస్తాన్ మూలమున్న ఏదైనా కంటెంట్.. సిమినా, వెబ్ సిరీస్, పోడ్ కాస్ట్, సాంగ్స్ మరేదైనా భారత్లో స్ట్రీమింగ్ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలి" అని అధికార ప్రకటన పేర్కొంది.
ఈ ప్రకటనలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా, యూట్యూబ్ తదితర ప్రాముఖ్య ఓటీటీలు కూడా వస్తాయని అర్థమవుతుంది. పాకిస్తాన్ మూలమున్న అన్ని వెబ్ సిరీస్లు, పాటలు, సినిమాలు ఇకపై భారత్లో లభించకుండా చేయాల్సిందిగా కేంద్రం సూచించింది.
ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకుంది. ఆ దాడిలో పలువురు భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా భారత వాయుసేన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)తో పాటు పాకిస్తాన్లోని బహావల్పూర్ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ తో దాడులు చేసింది.
Operation Sindoor పేరుతో చేపట్టిన దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, భారత్ పై అసత్య ఆరోపణలు, ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్న క్రమంలో పాకిస్తాన్కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ ఖాతాలను కూడా భారతదేశంలో ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లు బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రముఖులతో పాటు ఆ దేశ అధికారిక ఖాతాలు, రాజకీయ నాయకుల ఖాతాలు కూడా భారత్ లో బ్లాక్ చేశారు.
గత కొన్నేళ్లుగా భారత ఓటీటీ వేదికలపై పాకిస్తాన్ టీవీ సీరియల్స్, సినిమాలు, సంగీతం ప్రసారమవుతూ ప్రత్యేక ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. బోల్, ఖుదా కే లియే, కేక్, లాల్ కబూతర్ వంటి పాకిస్తాన్ సినిమాలు ప్రైమ్ వీడియో, యూట్యూబ్లపై అందుబాటులో ఉన్నాయి. పాటల విషయానికి వస్తే అతిఫ్ అస్లాం, అబిదా పర్వీన్, రహత్ ఫతేహ్ అలీ ఖాన్ వంటి గాయకులు భారత వినియోగదారులలో మంచి ఫాలోయింగ్ను సంపాదించారు.
ఇక నుంచి భారతదేశంలో పాకిస్తాన్ మూలాలున్న కంటెంట్ను అన్ని డిజిటల్ ప్లాట్ఫార్మ్లు నిలిపివేయాల్సిందిగా మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలియజేసింది. ఇది జాతీయ భద్రత పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఒక కీలక చర్యగా పరిగణించబడుతోంది.