Asianet News TeluguAsianet News Telugu

ఎస్బీఐ రీసెర్చ్: ఉద్దీపనలకు వేళయింది

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌ దెబ్బకు తల్లడిల్లిపోతున్నది. అసలే మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఈ ప్రాణాంతక కరోనా మహమ్మారి మరింత కుంగదీస్తున్నది.

Coronavirus: Fiscal, monetary steps required to support economy, say economists at SBI Research
Author
New Delhi, First Published Mar 18, 2020, 2:43 PM IST

న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌ దెబ్బకు తల్లడిల్లిపోతున్నది. అసలే మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఈ ప్రాణాంతక కరోనా మహమ్మారి మరింత కుంగదీస్తున్నది. ప్రస్తుతం భారత్‌దీ ఇదే పరిస్థితి. దీంతో మాంద్యం ముప్పు పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్దీపనలకు వేళైందని సూచిస్తున్నారు. 

దేశంలో వస్తు తయారీతోపాటు ధరలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక హెచ్చరించింది. చైనాలో ఉత్పత్తి నిలిపివేతతో దేశీయ కంపెనీలకు ముడి సరుకులు, విడిభాగాల సరఫరాకు అవాంతరాలు ఏర్పడవచ్చని, తత్ఫలితంగా ఉత్పత్తి తగ్గి ధరలు ఎగబాకే ప్రమాదం ఉందని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావం నుంచి భారత ఎకానమీని గట్టెక్కించేందుకు ఆర్థిక, ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని ఎస్బీఐ రీసెర్చ్  సూచించింది. 

‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ పోతే మార్కెట్లో మళ్లీ అసెట్‌ బబుల్‌ ఏర్పడే ప్రమాదం ఉంటుందే తప్ప వినియోగ డిమాండ్‌ పునరుద్ధరణకు అంతగా దోహద పడకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం, ఆర్బీఐ పరస్పర సహకారంతో ఆర్థిక, ద్రవ్య విధానపరమైన చర్యలు చేపట్టడం ఉత్తమ మార్గం’’ అని ఎస్‌బీఐ  గ్రూప్‌ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు.  

దేశంలో ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాలుస్తున్న ఈ మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రభావం చూపాల్సి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సారాంశం. ఈ వైరస్‌ వ్యాప్తితో హోటల్‌, ఏవియేషన్‌, రవాణా, మెటల్‌, ఆటో విడిభాగాలు, టెక్స్‌టైల్‌ రంగాలు అధికంగా ప్రభావితం కానున్నాయి. 

వివిధ రంగాల్లో సంక్షోభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సాయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 30 శాతం తగ్గడంతో దేశీయంగా లీటరు పెట్రోల్‌పై రూ.12, డీజిల్‌పై రూ.10 తగ్గే అవకాశం ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఇంధనాలపై ఎక్సైజ్‌ డ్యూటీని లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.35,000-40,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఉపాధి, ఆదాయం కోల్పోయిన అల్పాదాయ వర్గాల కోసం ప్రభుత్వం ఈ అదనపు ఆదాయాన్ని వినియోగించవచ్చు 

కరోనా ధాటికి కకావికలం అవుతున్న దేశీయ ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాలం పాటు విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌, హౌసింగ్‌తో పాటు ఇతర చార్జీల రాయితీ లేదా తగ్గింపులతో త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది.

ప్రతిపాదిత ప్యాకేజీపై చర్చించేందుకు ఆర్థిక, విమాన మంత్రిత్వ శాఖల మధ్య ఇప్పటికే పలుసార్లు చర్చలు కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా దెబ్బకు ఈనెలలో దేశీయ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ మార్గాల్లో పలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. 

ద్రవ్యోల్బణం కట్టడి.. తయారీ రంగ వృద్ధి.. సులభతర వ్యాపార నిర్వహణ.. వినియోగ సామర్థ్యం పెంపులపై దృష్టి సారించి ఆర్థిక, ద్రవ్యపరమైన ఉద్దీపనలు అందించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెంటనే రంగంలోకి దిగాలంటున్నారు.

స్తంభించిన పెట్టుబడులు.. మందగించిన తయారీ.. నీరసించిన వ్యాపారం.. పడిపోయిన విని మయ సామర్థ్యం.. తరిగిన ఆదాయం.. పెరిగిన నష్టాలు ఇదీ.. నేటి భారతీయ ఆర్థిక ముఖచిత్రం. ఈ గడ్డు పరిస్థితుల్లో కరోనా వైరస్‌.. దేశానికి ముచ్చెమటల్నే పట్టిస్తున్నది. 

ప్రజలు బయటకు రాలేని దుస్థితి నెలకొంటున్నది. ఫలితంగా కొనుగోళ్లు లేక అన్ని వ్యాపారాలు దిగాలుపడ్డాయి. దీంతో జీడీపీ మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడు ఏళ్ల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో జీడీపీ 4.7 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. అందుకే ఇక ఉద్దీపనలకు ఉపక్రమించాలని కేంద్రానికి సూచిస్తున్నారు.

పడకేసిన పారిశ్రామికోత్పత్తిని పరుగులు పెట్టించేలా నిర్ణయాలుండాలని వివిధ వర్గాల పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ సంబంధాలన్నీ దాదాపు తెగిపోయాయి. దీంతో విదేశాల నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి.

అందుకే దేశీయ వనరులను బలోపేతం చేసుకోవాలని ఆర్థిక, పారిశ్రామిక నిపుణులు సూచిస్తున్నారు. తదనుగుణంగా పరిశ్రమలకు సహకరించాలంటున్నారు. ఆగిపోయిన దిగుమతులతో ప్రభావితమైన రంగాల్లో ఉత్పత్తి పుంజుకునే మార్గాలను తొలుత అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

సాధారణ పరిస్థితులు నెలకొంటే దిగుమతులపై సుంకాల భారం తగ్గించాలని, అవకాశం ఉన్న రంగాల్లో పెట్టుబడులకు స్వేచ్ఛనివ్వాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హోటల్‌, విమానయానం, రవాణా, మెటల్‌, ఆటో విడిభాగాల రంగాలు కుదేలయ్యాయి. 
దీంతో వీటికి రుణ పునర్‌వ్యవస్థీకరణ సదుపాయం, చౌకగా కొత్త రుణాల మంజూరు వంటి వాటితో ఊతమివ్వాలని ఎస్బీఐ రిసెర్చ్‌ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లించలేని సంస్థలకు ఆర్థిక దన్ను ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. వారిపై భారం పడకుండా అండగా ఉండాలంటున్నారు.

వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం పెరిగినప్పుడే మార్కెట్‌ సజీవంగా ఉంటుంది. కాబట్టి మందగించిన వినిమయ సామర్థ్యాన్ని తిరిగి పుంజుకునేలా చేయాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. 

వినియోగదారుల చేతుల్లోకి మరింత నగదు చేరేలా నిర్ణయాలు తీసుకోవాలని, బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం అందేలా ప్రోత్సహించాలని చెప్తున్నారు. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలు ఇందుకు దోహదపడుతాయని, ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటికే మార్కెట్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ సంస్థలు పలు ఆఫర్లను తెస్తున్నాయని.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ చర్యలు కలిసివస్తే కళ తప్పిన మార్కెట్‌లో వెలుగులు విర జిమ్మడం తథ్యమంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లుతున్న నష్టాలను పూడ్చేందుకు ఆయా దేశాలు భారీగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. 

అమెరికా 850 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి సిద్ధమవుతున్నది. జర్మనీ 610 బిలియన్‌ డాలర్లు, బ్రిటన్‌ 35 బిలియన్‌ డాలర్లు, యూఏఈ 27.2 బిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌ 17.6 బిలియన్‌ డాలర్లు, సౌదీ 13.3 బిలియన్‌ డాలర్లు, స్విట్జర్లాండ్‌ 10.5 బిలియన్‌ డాలర్లు, ఈజిప్టు 6.4 బిలియన్‌ డాలర్లు, జపాన్‌ 4.1 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. 

2008 నాటి మాంద్యం పరిస్థితులకు మించిన నష్టం కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోతున్నదన్న అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, మరోవైపు వాహన తయారీ కంపెనీలూ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్‌.. భారత్‌లోని తన 10,000 మంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆదేశాలు జారీ చేసింది. 

కీలక పదవుల్లో ఉన్న వారు మినహాయించి మిగతావారందరూ ఇంటి వద్ద నుంచే పని చక్కబెట్టాలని కోరింది. వోల్వో ఇండియా, ఫియట్‌ క్రిస్లర్‌ ఇండియా కూడా ఫోర్డ్‌ బాటను అనుసరించాయి. టాటా మోటార్స్‌ సైతం తన ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లోని సిబ్బందిని ఇంటి పట్టునుంటూనే ఆఫీసు పనులు చక్కబెట్టాలని కోరింది. 

ఈ నెల 17 నుంచి ఏప్రిల్‌ 15 వరకు అంతర్జాతీయ మార్గాల్లో నడిపే సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు గోఎయిర్‌ ప్రకటించింది. అంతేకాదు, సిబ్బందిని రొటేషన్‌ పద్ధతిలో వేతనం లేని సెలవులపై పంపనున్నట్లు ప్రకటించింది.

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశీ విమాన ప్రయాణాలకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే గోఎయిర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

కరోనా వైరస్‌ దెబ్బకు దేశంలోని పలు నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే ఈ వైరస్‌ భయాలు సద్దుమణిగే వరకు దుకాణం కట్టేసే యోచనలో ఉన్నాయని సమాచారం.

ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడే రెస్టారెంట్లకు సైతం గడిచిన రెండు వారాల్లో కస్టమర్ల తాకిడి అనూహ్యంగా తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తంగా దేశంలో రెస్టారెంట్లకు కస్టమర్లు 30-35 శాతం మేర తగ్గినట్లు, మాల్స్‌లోని రెస్టారెంట్లపై ప్రభావం అధికంగా ఉందని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios