ఎఫ్డీఐ నిబంధనలతో ఇండియాకే నష్టం.. డ్రాగన్ మదుపర్లు.. కానీ!
సరిహద్దు దేశాలు ప్రత్యేకించి చైనా నుంచి మనదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన నిబంధనతో చైనా ఇన్వెస్టర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇండియాకు చైనా మనీ అవసరం లేకపోతే వేరే దేశాలలో ఇన్వెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: సరిహద్దు దేశాలు ప్రత్యేకించి చైనా నుంచి మనదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన నిబంధనతో చైనా ఇన్వెస్టర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇండియాకు చైనా మనీ అవసరం లేకపోతే వేరే దేశాలలో ఇన్వెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
చైనా ఇన్వెస్ట్మెంట్లను అడ్డుకుంటే అది ఇండియాకే నష్టమని చైనా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. చైనా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలకు ఇండియా కీలకం కాదని, ఎఫ్డీఐ రూల్స్ను కఠినతరం చేయడం వల్ల చైనా ఇన్వెస్ట్మెంట్లు వేరే దేశాలకు వెళతాయని అన్నారు.
మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వలన చైనీస్ ఇన్వెస్టర్లకు ఇండియాపై నమ్మకం తగ్గుతుందని, ఇన్వెస్ట్ చేయడానికి వెనకడుగేస్తారని అభిప్రాయపడ్డారు. చైనా ఇన్వెస్టర్ల నుంచి ఇండియన్ కంపెనీలను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎఫ్డీఐ రూల్స్ను మార్చిన విషయం తెలిసిందే.
ఈ రూల్స్ ప్రకారం చైనా ఇన్వెస్టర్లు ఆటోమెటిక్ రూట్లో ఇండియన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు. వీరు ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్స్ ఇప్పటికే ఉన్న ఎఫ్డీఐ ఓనర్ షిప్ ట్రాన్స్ఫర్కు కూడా వర్తిస్తాయి.
డీల్ను రెండు లేదా మూడు రోజుల్లో క్లోజ్ చేయడంలో చైనీస్ వెంచర్ క్యాపిటలిస్టులు సిద్ధహస్తులని, ఎఫ్డీఐ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్స్పై ప్రభుత్వం కఠినంగా ఉండడంతో వీరు వెయిట్ చేయాల్సి వస్తోందని విశ్లేషకులు చెప్పారు.
భారత్ తన ఎఫ్డీఐ పాలసీని మార్చడం వలన చైనీస్ కార్పొరేట్ సర్కిళ్లు ఆందోళనలో ఉన్నాయని ఈ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఇండియన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై నమ్మకం పడిపోతుందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ దీంతో తాత్కాలికంగా ఆగిపోతాయని చెప్పారు.
వెంచర్ క్యాపిటలిస్ట్లు వెయిట్ అండ్ వాచ్ మోడ్ను ఫాలో అవుతారని అభిప్రాయపడ్డారు. ‘ఇన్వెస్టర్లందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు’ అని లింక్ లీగల్ లా సర్వీసెస్ పార్టనర్, చైనా డెస్క్ హెడ్ సంతోష్ పాయ్ చెప్పారు.
ప్రస్తుతం ఇండియాతో పెట్టుబడుల లావాదేవీలు జరుపుతున్న ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ఇండియా తాజా నిర్ణయం వల్ల ఇండోనేషియా, థాయ్లాండ్, వియత్నాం, ఫిలిప్పిన్స్, ఆఫ్రికా దేశాలకు చైనా ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోతాయని చైనా వెంచర్ క్యాపిటలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఎఫ్డీఐ రూల్స్ మార్పుపై చైనా అసంతృప్తిగా ఉందని ఎవలాన్ కన్సల్టింగ్ సీఈఓ శ్రీధర్ వెంకటేశ్వరన్ అన్నారు. ఈ రూల్స్ను కొన్ని సెక్టార్లకు లిమిట్ చేస్తే చాలని అభిప్రాయపడ్డారు. కాగా ఒక్క ఇండియానే కాదు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలు తమ కంపెనీలను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాయి. వీటి టార్గెట్ చైనానే అని ఎనలిస్టులు చెప్పారు.
గత ఐదేళ్లుగా ఇండియన్ ఈ–కామర్స్, టెక్, రిటైల్, ఆటోమోటివ్, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో ఎక్కువగా చైనా కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 2011 లో ఇండియాలో చైనా ఇన్వెస్ట్మెంట్లు కేవలం 102 మిలియన్ డాలర్లే! ప్రస్తుతం ఇవి 5–8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఇండియన్ స్టార్టప్లలో బైదు, అలీబాబా, టెన్సంట్ వంటి చైనీస్ టెక్ ఇన్వెస్టర్లు 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. గత ఐదేళ్లలో 30 ఇండియన్ యూనికార్న్లకు 18 కంపెనీలకు చైనా ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. చైనీస్ వీడియో యాప్ టిక్టాక్ సబ్స్క్రిప్షన్ ఇండియాలో యూట్యూబ్ను అధిగమించింది.
అలీబాబా, టెన్సెంట్, బైట్డ్యాన్స్ వంటి కంపెనీలు ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ వంటి వాటితో పోటీపడుతున్నాయి. ఇండియన్ ఫోన్ మార్కెట్ను చైనా కంపెనీలు డామినేట్ చేస్తున్నాయి. షియోమీ వచ్చే ఐదేళ్లలో 100 ఇండియన్ స్టార్టప్లలో రూ.ఏడు వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది.
ఇదిలా ఉంటే పొరుగును ఉన్న దేశాల్లోని కంపెనీలు ప్రత్యేకించి చైనా పెట్టుబడులు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పట్టు విడుపులతో వ్యవహరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
బలహీనంగా ఉన్న భారత ఆర్థిక స్థితి చైనాకు అనుకూలంగా మారకూడదనే కేంద్రం ఎఫ్ డీఐ నిబంధనలను సరళతరం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చైనా కంపెనీలు ఇప్పటికే విధుంచుకున్న పెట్టుబడి లక్ష్యాలకు ఈ నిర్ణయం బ్రేకులు వేసింది.
దీనిపై చైనా ప్రభుత్వం సహా, అక్కడి పారిశ్రామిక వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారి పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న భారత్ తాజాగా పట్టువిడుపుల వైఖరిని ఎంచుకుంది.
ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికలకు ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు చైనా కంపెనీ ప్రతిపాదనల పరీశీలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అప్రధాన్య రంగాలకు సంబంధించి చైనా కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.