సూరి హత్య: భాను కిరణ్ తప్పించుకు తిరిగిన వైనం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసు తుది తీర్పు మంగళవారం వెలువడింది. హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్కు యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు ఖరారు చేసింది.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసు తుది తీర్పు మంగళవారం వెలువడింది. హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్కు యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు ఖరారు చేసింది.
సూరి హత్యకేసుకు సంబంధించి 120 మంది సాక్షులను సీఐడీ అధికారులు విచారించారు. వందలాది డాక్యుమెంట్లను పరిశీలించారు. సూరి హత్యకేసులో భానుకిరణ్తో పాటు మరో నలుగురిని హైదరాబాద్ పోలీసులతో పాటు సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
2011 జనవరి 3న జూబ్లీహిల్స్ సమీపంలోని నవోదయకాలనీ ప్రాంతంలో సూరిని భానుకిరణ్ కాల్చి చంపాడు. ఏడేళ్లు సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో అనేక వివరాలను సేకరించిన తెలంగాణ సీఐడీ వాటిని నాంపల్లి కోర్టుకు సమర్పించింది.
కేసు విచారణలో భాగంగా ఘటనా స్థలంలో ఉన్న సూరి డైవ్రర్ మధుమోహన్రెడ్డి వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.
పరిటాల రవిహత్య కేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చిన సూరి ఇకపై ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోకూడదని పదేపదే చెప్పుకొచ్చేవాడు. పరిటాల రవి కేసుపైనే ఎక్కువ ఆలోచించేవాడు.
అయితే ఓ కేసు విషయంలో 2011 జనవరి 3న న్యాయవాదిని కలిసి సనత్ నగర్ వెళ్తుండగా యూసుఫ్గూడ నవోదయ కాలనీలో సాయంత్రం 7.15 గంటలకు కారు ముందు సీట్లో కూర్చున్న సూరిపై వెనుక కూర్చున్న భానుకిరణ్ కాల్పులు జరిపి పారిపోయాడు.
మధుమోహన్రెడ్డి సూరి మీద దాడి జరిగిందని సన్నిహితులకు ఫోన్చేసి అదే కారులో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సూరి మృతి చెందినట్టు నిర్ధారించారు.
అయితే సూరి హత్య అనంతరం నవోదయ కాలనీలో కారు దిగిన భానుకిరణ్ సమీపంలో నిలిపి ఉంచిన బైక్పై తన అనుచరులైన హరిబాబు, సుబ్బయ్యతో కలిసి పారిపోయాడు. అక్కడ నుంచి నేరుగా నగర శివారుకు చేరుకుని సమావేశమయ్యారు. భానుకిరణ్ గన్మన్ మన్మోహన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిగతా వారిని రహస్య ప్రదేశంలో తలదాచుకోమని భానుకిరణ్ సూచించాడు.
ఆరోజు భానుకిరణ్ పటాన్చెరు మీదుగా షోలాపూర్ చేరుకున్నాడు. మన్మోహన్ అక్కడి నుంచి పుణె, ముంబై మీదుగా ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలోని శర్మ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. అయితే ఢిల్లీలో శర్మ లాడ్జిలో భాను కిరణ్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వలపన్నారు. అయితే ఆ వలలో భానుకిరణ్ అనుచరుడు మన్మోహన్ను చిక్కగా భానుకిరణ్ తప్పించుకున్నాడు.
సూరి హత్య కేసుకు సంబంధించి అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. భానుకిరణ్ గన్మన్ మన్మోహన్ సింగ్తోపాటు సుబ్బయ్య, ఆవుల వెంకటరమణ, బోయ వెంకట హరిబాబును మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ అని, అతడు పరారీలో ఉన్నాడని ఏకే ఖాన్ స్పష్టం చేశారు. సూరిని భానుకిరణే కాల్చి చంపాడని అతడి కోసం మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో గాలిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, భూ దందాలే హత్యకు కారణమని అర్థమవుతోందని, భాను దొరికితే మరేదైనా కోణం వెలుగు చూస్తుందేమో చెప్పలేమని అప్పట్లో ప్రకటించారు.
నలుగురు నిందితుల నుంచి సిమ్, డెబిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బెయిల్ పై విడుదలైన తర్వాత సూరి భారీగా ఆస్తులు కొనుగోలులో చేశాడు. భానుతోపాటు ఇతరుల పేరుమీద100కు పైగా ఆస్తులను సూరి కూడబెట్టాడు. వాటిలో భాను పేరు మీదే 9 ఆస్తులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఆ తర్వాత కేసు విచారణను సీఐడీకి అప్పగించారు పోలీసులు. సిఐడీ అధికారులు సుధీర్ఘ కాలంపాటు పలు రాష్ట్రాల్లో విచారణ చేపట్టారు. అయితే 2012 ఏప్రిల్12న జహీరాబాద్లోని ఓ దాబా వద్ద భానును సీఐడీ బృందం అరెస్టు చేసింది.
అతడి అరెస్టు రాజకీయ, సినీ రంగాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. భాను నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని అంతా ఆతృతగా ఎదురుచూశారు. అప్పటికే పలువురు రాజకీయ నాయకుల పేర్లు ప్రచారంలో ఉండటంతో భానుకిరణ్ ఏం చెప్తాడా అంటూ అంతా ఎదురుచూశారు.
సూరిని హత్య చేసిన తర్వాత భానుకిరణ్ పోలీసుల నుంచి పక్కా ప్లాన్ ప్రకారం తప్పించుకునేవాడు. భాను కిరణ్ దాదాపు ఏడాదిపాటు మధ్యప్రదేశ్లోని సినోయి పట్టణంలో ఓ చిన్న గదిలో తలదాచుకున్నాడు. స్థానిక బ్రోకర్ల ద్వారా మహేశ్ కుంజుమన్ పేరిట పాన్ కార్డు, డైవ్రింగ్ లైసెన్స్ సంపాదించాడు.
కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాలలో తిరిగేవాడు. అజ్ఞాతంలో ఉన్నప్పటికీ డబ్బుకు ఇబ్బంది పడకుండా వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్నట్టు పోలీసులు చెప్పారు. చివరికి ఓ స్నేహితుడి ద్వారా భానుకిరణ్ డబ్బు తీసుకుంటుండగా జహీరాబాద్ దాబాలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
సూరి హత్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ సంచలనమైతే భాను అరెస్టు మరో సంచలనం. సూరిని భానుకిరణ్ హత్య చెయ్యడం వెనుక ఎవరి హస్తం ఉందో ఏం చెప్పబోతున్నాడో అంటూ అటు టాలీవుడ్లోనూ ఇటు రాజకీయ నాయకుల్లో కలకలం మెుదలైంది.
టాలీవుడ్లోని పలువురు సినీ నిర్మాతలతో భాను చెట్టాపట్టాలేసుకుని తిరగాడన్న ఆరోపణలుగుప్పుమన్నాయి. అనేక సెటిల్ మెంట్లు, దందాలకు వీరు పాల్పడ్డారని సీఐడీ విచారణలో వెల్లడైంది. వందల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనను సూరి అవమానించాడని మాటలతో వేధించాడని, చంపేస్తానని బెదిరించాడని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సూరిని హత్య చేయాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో భానుకిరణ్ అంగీకరించాడు. దీంతో నాంపల్లి కోర్టు అతడికి జీవితఖైదు విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
పరిటాల కుటుంబం కళ్లలో ఆనందం కోసమే: భానుపై భానుమతి సంచలనం
భానుకిరణ్కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి
భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...
సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి