Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Travel : ఏపీలో మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 47 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

స్త్రీ శక్తి పథకంతో మహిళల విప్లవం.. ఇక దివ్యాంగులకు కూడా ప్రయాణం ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ లో మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసెంబ్లీలో బుధవారం జరిగిన బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనికి అదనంగా దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నామని ఆయన ప్రకటించారు.
మహిళల ప్రయాణాల్లో భారీ పెరుగుదల
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో 2025, ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందని మంత్రి తెలిపారు. పథకం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 47 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని ఆయన వెల్లడించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల శాతం కేవలం 40 శాతంగా ఉండగా, ఈ పథకం అమలుతో అది 65 శాతానికి పెరగడం విశేషం. ప్రస్తుతం రోజుకు సగటున 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1660 కోట్ల భారీ సబ్సిడీని భరించిందని మంత్రి వివరించారు.
దివ్యాంగులకు తీపి కబురు
మహిళలకే కాకుండా, సమాజంలో వెనుకబడిన దివ్యాంగులకు కూడా అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ సమావేశంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు. దీంతో లక్షలాది మంది దివ్యాంగులకు రవాణా భారం తగ్గనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల వంటి ఐదు రకాల సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత
రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. "ఆటో డ్రైవర్ సేవలో" పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,90,669 మంది డ్రైవర్లకు రూ. 436 కోట్ల ఆర్థిక సహాయం అందించామని ఆయన తెలిపారు. అలాగే రవాణా శాఖలో ఆధునిక వసతుల కల్పనలో భాగంగా కర్నూలు జిల్లా డోన్, ప్రకాశం జిల్లా దర్శిలో డ్రైవర్ల శిక్షణ, పరిశోధన సంస్థల (IDTR) నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. విశాఖపట్నం గంభీరంలో రూ. 16.50 కోట్లతో అత్యాధునిక I&C సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆటోమేషన్కు ప్రాధాన్యం.. భద్రతపై దృష్టి
రవాణా శాఖలో అవినీతిని తగ్గించేందుకు ఆటోమేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు (ADTT) అందుబాటులో ఉండగా, మారుతి సుజుకి సీఎస్ఆర్ నిధులతో మరో 5 ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 18 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) పనిచేస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చేశామని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని భద్రతా చర్యలకే కేటాయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
విద్యార్థులకు ఉచితం.. కొత్త బస్సుల రాక
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని మండిపడ్డ ఆయన, ప్రస్తుతం 75% బస్సుల్లో మహిళలకు ఉచిత సేవలు అందిస్తున్నామని గర్వంగా చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం పీఎంఈ బస్ సేవ కింద 750 కొత్త బస్సులు రానున్నాయని, పర్యావరణ హితం కోసం సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన సభకు వివరించారు.

