శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డుప్రమాదం జరిగి నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Telangana : మంగళవారం తెల్లవారుజామున తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలో టూరిస్ట్ బస్సు, లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక 20 మందికి తీవ్ర గాయాలవగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందినవారు ఓ శుభకార్యం కోసం టూరిస్ట్ బస్సులో వెళ్లారు. వీళ్లు విందు ముగించుకుని అర్ధరాత్రి తమ గ్రామానికి తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు లారీని ఢీకొట్టడంతో ఘోరం జరిగింది.
బీజాపూర్-హైదరాబాద్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో నిద్రిస్తున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు... ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కొందరి ప్రాణాలు పోయాయి... మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయాలతో పడివున్నవారికి పరిగి హాస్పిటల్ కు తరలించారు... పరిస్థితి విషమంగా ఉన్నవారికి మెరుగైన వైద్యం హైదరాబాద్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం పరిగి హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదం శుభకార్యంలో విషాదాన్ని నింపింది.