Asianet News TeluguAsianet News Telugu

భర్త ఎదుటే భార్యపై, కొడుకు ఎదుటే తల్లిపై గ్యాంగ్ రేప్... కరుడుగట్టిన పాణ్యం ముఠా అరెస్ట్

కేవలం దోపిడీలు మాత్రమే కాదు మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగలముఠాను ఎట్టకేలకు గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు.

panyam robbery gang arrested in guntur district
Author
Guntur, First Published Jan 9, 2022, 12:05 PM IST

గుంటూరు: కూలీ పనుల కోసమంటూ ఇతర ప్రాంతాలకు వెళతారు... అక్కడ అమాయకులుగా నటిస్తూ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలోనే మహిళలపై సామూహిక  అత్యాచారాలకు కూడా తెగబడుతుంటారు. ఇలా ఇప్పటికే పలు దోపిడీలు, పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన కరుడుగట్టిన పాణ్యం ముఠా (panyam robbery gang) ను ఎట్టకేలకు గుంటూరు (guntur district) పోలీసులు అరెస్ట్ చేసారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ (kurnool) జిల్లా పాణ్యం ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కూలీ పనుల కోసమంటూ ఇతర ప్రాంతాలకు వెళుతూ పగటిపూట రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి సమయంలో దారిదోపిడీలకు పాల్పడేవారు. నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను అడ్డగించి వారివద్ద ఆభరణాలు, నగదు దోచుకునేవారు. అంతటితో ఆగకుండా మహిళలు వుంటే వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారు. 

ఇలా గుంటూరు జిల్లా మేటికొండూరు (metikondur rape case) మండలం పాలడుగు గ్రామ సమీపంలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తున్న జంటను ఈ దోపిడీ ముఠా అడ్డుకుంది. భర్తను చితకబాది అతడి ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా దారుణానికి పాల్పడిన దుండగులు దంపతుల వద్దగల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. 

ఇక యడ్లపాడు (yedlapadu) పరిధిలోనూ ఇలాగే రెండు జంటలపై దాడిచేసి దోపిడికీ పాల్పడ్డారు. మరో ఘటనలో తల్లీ కొడుకులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ దోపిడీ ముఠా అడ్డుకుంది. కొడుకు ఎదుటే తల్లిని అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ దోపిడీ ముఠా అఘాయిత్యాలకు పాల్పడింది. 

అయితే ఇలా దారిదోపిడీ, మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతోదోపిడీ ముఠా ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో దారుణాలకు పాల్పడుతున్నది పాణ్యం ప్రాంతానికి చెందిన ముఠాగా గుర్తించారు.  

గుుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పాణ్యం దోపిడీ ముఠా సమాచారాన్ని పంపించారు అధికారులు. దీంతో యడ్లపాడు పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అరెస్ట్ చేయగా వారే పాణ్యం ముఠాగా నిర్దారణ అయ్యింది. పోలీసులు విచారణలో ఈ ముఠా సంచలన విషయాలను బయటపెట్టింది.

ఇప్పటివరకు కేవలం గుంటూరు జిల్లా పరిదిలోనే 30కి పైగా అత్యాచారం, దోపిడీలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కరుడుగట్టిన ముఠా సభ్యులకు కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్  చేస్తున్నారు. పోలీసులు కూడా వివిధ సెక్షన్ కింద వీరిపై కేసులు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. 

ఈ దోపిడీ ముఠా గుంటూరు జిల్లా మేడికొండూరు పాలడుగు గ్రామ శివారులో జంటను అడ్డగించి భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గతేడాది సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి బైక్ మీద వెళ్తున్న దంపతులను దుండగులు అడ్డగించారు. మహిళ భర్తను తీవ్రంగా కొట్టడమే కాదు కత్తులతో బెదిరించారు. ఆ తర్వాత వివాహితను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios