Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. టిక్కెట్ డబ్బులు ఇవ్వలేదని కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో యువకుడి మృతి

టిక్కెట్ కు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడిని ప్రైవేట్ బస్సు సిబ్బంది కిందకి తోసేశారు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

Atrocious.. A young man died after being pushed from a moving bus for not paying for the ticket..ISR
Author
First Published May 8, 2023, 7:52 AM IST

టిక్కెట్ ఛార్జీకి డబ్బులు ఇవ్వలేదని డ్రైవర్ యువకుడిని కదులుతున్న బస్సుల్లో నుంచి తోసేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న పోలీసులు బాధితుడిని గుర్తించి హాస్పిటల్ లో చేర్పించేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించి అతడు మరణించాడు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. మూడు రోజుల్లో ఈ ఘటనను ఛేదించారు. అనంతరం ఆదివారం మీడియాతో వివరాలు వెల్లడించారు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం మధురవాడకు చెందిన గేదెల భరత్ కుమార్ ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి సమయంలో తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో శ్రీకాకుళం చేరుకున్నాడు. అయితే తనకు ఓ పని ఉందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాల్సి ఉందని ఫ్రెండ్స్ కు చెప్పారు. దీంతో వారు తెల్లవారుజామున భరత్ కుమార్ ను భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎక్కించారు. నవభారత్ చౌరస్తా వద్ద అతడిని బస్సు ఎక్కించి స్నేహితులు అక్కడి నుంచి కారులో బయలుదేరారు.

బస్టాప్‌లో వేచివున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

అయితే బస్సులోకి ఎక్కిన భరత్ కుమార్ ను క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్‌ రామకృష్ణ టిక్కెట్ కోసం రెండు వందలు ఇవ్వాలని అన్నారు. అయితే తన వద్ద డబ్బులు లేవని, ఫ్రెండ్స్ ఫోన్ పే ద్వారా పంపిస్తారని చెప్పారు. దీంతో వారు చాలా సమయం వరకు డబ్బులు అడగలేదు. కానీ ఎంత సేపు అయినా వారికి మనీ ట్రాన్సఫర్ కాకపోవడంతో మళ్లీ భరత్ ను డబ్బులు ఇవ్వాలని అడిగారు. తన స్నేహితులకు ఫోన్ చేశానని, స్విచ్ ఆఫ్ వస్తోందని భరత్ బదులిచ్చాడు. విశాఖపట్నం చేరుకున్న తరువాత డబ్బులు ఇస్తానని వారికి చెప్పాడు.

Kerala Boat Tragedy: ఘోర పడవ ప్ర‌మాదం.. హౌస్ బోట్ బోల్తా, 21 మంది జ‌ల‌స‌మాధి

అయితే ఇదే విషయంలో భరత్, డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో ఆగ్రహంతో బుడుమూరు సమీపంలో బస్సు కదులుతుండగానే కిందకి తోసేశారు. హైవేపై ఉన్న డివైడర్ ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయమవడంతో పాటు కాలు కూడా విరిగింది. అతడిని హైవే పోలీసులు గమనించి, హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మర్గమధ్యంలోనే పరిస్థితి విషమించి ఆయన చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల సాయంతో ఈ కేసును ఛేదించారు. డ్రైవర్ ను, క్లీనర్ ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios