అమెరికా సెక్స్ రాకెట్: చంద్రబాబును లాగిన వాసిరెడ్డి పద్మ
బాబుపై నిప్పులు చెరిగిన వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: అమెరికాలో సెక్స్ రాకెట్ విషయమై తానా అధ్యక్షుడు వేమన సతీష్తో పాటు మరికొందరు తెలుగు సంఘాల ప్రతినిధులను ఎప్బిఐ అధికారులు ప్రశ్నించారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. సతీష్ ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని ఆమె ఆరోపించారు. అంతర్జాతీయంగా ఏపీ పరువును తీశారని ఆమె చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
వైసీపీ కార్యాలయంలో ఆమె గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. నార్త్ అమెరికాకు ఏపీ ప్రతినిధిగా కోమటిజయరాం ఉన్నారని చెప్పారు. 2017 నాటికే జయరాం పదవీ కాలం పూర్తైతే ఆయన పదవిని పొడిగించారని ఆమె గుర్తు చేశారు. తెలుగు సంఘాలకు తెలియకుండా అమెురికాలో సెక్స్ రాకెట్ కొనసాగిందని తాను భావించడం లేదన్నారు. అమెరికాలో సెక్స్ రాకెట్ విషయమై టిడిపికి సన్నిహితుడుగా ఉన్న సతీష్ ను ఎఫ్బిఐ పోలీసులు విచారణ చేశారని ఆమె చెప్పారు.
జయరాం లాంటి వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె చెప్పారు. ఏపీ పరువును చంద్రబాబునాయుడు అంతర్జాతీయంగా తీశారని ఆమె ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం లేని పార్టీ టిడిపి అంటూ ఆమె ధ్వజమెత్తారు. అమెరికా సెక్స్ రాకెట్ విషయమై ఎఫ్బిఐ దాఖలు చేసిన చార్జీషీట్ను ఆమె మీడియా సమావేశంలో చూపారు.
గతంలో విజయవాడలో కాల్ మనీ వ్యవహరాల్లో టిడిపి నేతలకు ప్రమేయం ఉందని ఆమె గుర్తు చేశారు. కాల్ మీనీ సీఎం అన్నందుకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారని ఆమె గుర్తు చేశారు. ఏపీ ప్రజలను నట్టేట ముంచుతున్న పార్టీ టిడిపి అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
అమెరికాలో టిడిపికి చెందిన వ్యక్తులు, సన్నిహితులు సెక్స్ రాకెట్ ను నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. అమెరికాలో తమ వారిని కాపాడే ప్రయత్నాన్ని టిడిపి నేతలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
ఇంత వివాదం నడుస్తోంటే అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నవారు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలుగు సంఘాలకు తెలియకుండా సెక్స్ రాకెట్ జరిగిందని తాను భావించడం లేదన్నారు.