మోసం ఎలా జరుగుతోంది?
పెట్రోల్ పంపుల్లో మోసానికి ముఖ్య కారణం జనం నిర్లక్ష్యం, సిబ్బంది అతి తెలివి. పెట్రోల్ పోయించుకునేటప్పుడు చాలామంది మీటర్ చూడరు. రసీదు అడగరు. డెన్సిటీ, రేటు చూసేది చాలా తక్కువమంది. ఇదే పెట్రోల్ బంక్ సిబ్బందికి వరంలా మారుతుంది. చాలామంది తొందరలో ఉంటారని, దిగకుండానే కొట్టించుకుంటారని వాళ్లకు తెలుసు. అందుకే మీటర్ జీరో చేయకుండా, తెలివిగా పాత మీటర్ ఉన్నచోటు నుంచే పెట్రోల్ పోస్తుంటారు. లేదా తక్కువ పోసి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు.
ఫోన్ వద్దు
పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఫోన్ చూస్తూ గడపడం చాలామంది అలవాటు. ఇది డేంజర్ అలవాటు. ఇది మనం మోసపోవడానికి ఒక అవకాశం ఇవ్వడమే కాదు.. టెక్నికల్ గానూ సెల్ ఫోన్లు అక్కడ వాడితే పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ మాట్లాడటం ఆపి మీటర్ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎంత పోస్తున్నారో, మధ్యలో ఆపి మళ్లీ స్టార్ట్ చేశారో అనేది చూడాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెండుసార్లు నొక్కుతారు, కానీ కౌంటింగ్లో తేడా కొడతారు. అందుకే కాసేపు ఫోన్ జేబులో పెట్టి, ఫ్యూయల్ మీద దృష్టి పెట్టండి.
జీరోతో మొదలైందా?
ఫ్యూయల్ కొట్టించేటప్పుడు మీరు చూడాల్సింది మీటరే. అది జీరోతో మొదలవుతుందా లేదా అని చూడాలి. కొన్నిసార్లు సిబ్బంది తొందరగా చూపిస్తారు, మీటర్ ముందు నుంచే ఆన్ చేస్తారు. దీంతో ముందు కస్టమర్ లెక్క కంటిన్యూ అవుతుంది, మీకు తక్కువ ఫ్యూయల్ వస్తుంది, కానీ డబ్బులు మాత్రం ఫుల్ కడతారు. సింపుల్గా సిబ్బంది పైప్ తీయగానే "మీటర్ జీరో చూపించండి" అని చెప్పండి, మీరూ చూసి కన్ఫర్మ్ చేసుకోండి.
స్పీడుగా తిరిగే మీటర్ - మోసానికి అలారం!
కొన్ని పంపుల్లో మీటర్ చాలా స్పీడుగా తిరుగుతుంది. అంటే 100 లేదా 500 రూపాయలకు ఎంత స్పీడుగా చేరాలో, అంతకంటే ఎక్కువ స్పీడుగా నంబర్లు పెరుగుతాయి. ఇది టెక్నికల్ మోసం. డిజిటల్ మీటర్లో మార్పులు చేస్తారు, కౌంటింగ్ ఎక్కువ చూపిస్తారు, ఫ్యూయల్ తక్కువ వస్తుంది. మీటర్ తేడాగా తిరుగుతుంటే వెంటనే సిబ్బందిని అడగండి. మేనేజర్కు కంప్లైంట్ చేయండి, మిగతా కస్టమర్లను కూడా హెచ్చరించండి.
ట్యాంక్ ఖాళీగా వద్దు
ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యాక ఫ్యూయల్ పోయిస్తే ఎక్కువ లాభం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజం వేరు. ట్యాంక్ ఖాళీ అయితే గాలి, తేమ చేరుతాయి. ఇవి రెండూ ఇంజిన్ కి హాని చేస్తాయి. గాలి ఇంజెక్టర్ సిస్టమ్లోకి వెళ్తుంది. తేమ వల్ల ఫ్యూయల్ పంప్ పాడవుతుంది. అందుకే ట్యాంక్ రిజర్వ్ లెవెల్కు రాకముందే ఫ్యూయల్ పోయించాలి.