నందిగ్రామ్‌లో దాడి ఘటన తర్వాత తీవ్రమైన కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

నందిగ్రామ్‌లో దాడి ఘటన తర్వాత తీవ్రమైన కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మరో 48 గంటలపాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సినప్పటికీ.. మమత అభ్యర్థన మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న మమత ఆస్పత్రి నుంచి వీల్‌చైర్‌లో బయటకొచ్చి అభివాదం చేశారు. మరోవైపు మమతా బెనర్జీపై ‘దాడి’కి నిరసనగా శుక్రవారం టీఎంసీ కార్యకర్తలు నిశ్శబ్ద మార్చ్‌ చేపట్టారు.

మరోవైపు మమతా బెనర్జీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని ఆరోపిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్‌ అరోరాను కలిసిన పార్టీ నేతల బృందం.. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది.

Also Read:నందిగ్రామ్‌లో మమతపై అటాక్: ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..?

ఇందుకు సంబంధించి కొన్ని మెమోలు కూడా సమర్పించింది. గతంలో సోషల్‌మీడియా వేదికగా బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై బెదిరింపులకు పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. 

మరోవైపు మమతా బెనర్జీ ఆసుపత్రిలో చేరడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం మహాశివరాత్రిని పురస్కరించుకుని కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి సీఎం.. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది.

అయితే ఘటన నేపథ్యంలో దానిని కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఇప్పుడు దీదీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో మార్చి 14న మేనిఫెస్టోను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.