కేసీఆర్ నాకు బాస్, టీఆర్ఎస్లో చేరుతున్నా: ఒంటేరు
ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని... టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఓటర్లతో ఏక పక్షంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని... టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఓటర్లతో ఏక పక్షంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరపున పోరాటం చేసినా కూడ ఆ గ్రామాల్లో కూడ కేసీఆర్కు భారీ మెజారిటీ రావడంతో తమ పోరాటాలు సరైనవి కావని తేలిందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరాలని ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. పదవులు, డబ్బుల కోసం తాను ఏనాడూ కూడ ఆలోచించలేదన్నారు. 15 ఏళ్లుగా తన వెంటనే తన క్యాడర్ ఉందన్నారు. తాను టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సమయంలో కూడ ఒక్క మాట కూడ మాట్లాడకుండా టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన గుర్తు చేసుకొన్నారు.
ఇవాళ కూడ తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకొన్న సమయంలో క్యాడర్ తన వెంటనే వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు బంధుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు మద్దతుగా నిలిచారని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ మద్దతు కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చెప్పినా కూడ ప్రజలు విశ్వసించలేదన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం కారణంగా నిర్వాసితులకు పెద్ద ఎత్తున పరిహారం చెల్లించాలని తాను పోరాటం చేశానని ఆయన గుర్తు చేశారు.
అయితే ఈ గ్రామాల్లో కూడ ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్కు ఓట్లేశారని చెప్పారు.ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని అనిపించిందన్నారు.ప్రజల నాడిని పట్టుకోవడంలో వైఫల్యం చెందినట్టు ఆయన తెలిపారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఆ పార్టీకి ఓట్లను కురిపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని తాను ఎఫ్పుడూ పరితపించేవాడినని చెప్పారు. అవినీతికి, గూండాయిజానికి వ్యతిరేకంగా నిలబడినట్టు చెప్పారు. ఎప్పుడైనా గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనేది తన కోరికగా ఆయన చెప్పారు.
కేసీఆర్ నుండి తనకు అందిన ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మెదక్ ఎంపీ తన గురించి ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. టీడీపీలో పనిచేసిన సమయంలో తనకు చంద్రబాబునాయుడు,. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో రాహుల్ , సోనియా, రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన బాస్ లని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తనకు బాస్ అంటూ ప్రతాప్ రెడ్డి చెప్పారు.
సంబంధిత వార్తలు
కారెక్కనున్న వంటేరు: తెర వెనక మంత్రాంగం ఆయనదే...
కేసీఆర్ ప్లాన్ ఇదీ: ఒంటేరుకు ఆహ్వానం అందుకే
టీఆర్ఎస్లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి