- Home
- Telangana
- నిష్ఠతో లేకపోతే ఈ ఆలయానికి వెళ్లే దారి మర్చిపోతారు.. హైదరాబాద్కు దగ్గర్లో 900 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్
నిష్ఠతో లేకపోతే ఈ ఆలయానికి వెళ్లే దారి మర్చిపోతారు.. హైదరాబాద్కు దగ్గర్లో 900 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్
Telangana: తెలంగాణలో ఎన్నో ప్రముఖ దైవక్షేత్రాలున్నాయి. వీటిలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. 900 ఏళ్ల చరిత్ర ఉన్న అలాంటి ఒక అద్భుత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రత్యేకతల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆలయ నేపథ్యం, చరిత్ర
హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల గ్రామంలో ఉందీ ఆలయం. సుందిళ్లలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. స్వామివారు ఇక్కడ స్వయంభూవుగా వెలిశారని భక్తుల నమ్మకం. గోదావరి నది తీరాన ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం దశాబ్దాలుగా భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది.
స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి విశిష్ఠత
ఈ ఆలయంలో ప్రధాన దైవం నరసింహ స్వామి. సాధారణంగా నరసింహ స్వామి ఉగ్రరూపంలో కనిపిస్తారు, కానీ ఇక్కడ ప్రసన్న రూపంలో దర్శనమివ్వడం విశేషం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని, ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ఈ స్వామిని దర్శించుకుంటారు. స్వామివారు శాంత రూపంలో కనిపించడం విశేషం.
ఆలయ నిర్మాణం, పరిసరాలు
ఆలయ గోపురంతో పాటు ప్రాకారాన్ని దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఇటీవలి కాలంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి. గోదావరి నదికి అతి సమీపంలో ఉండటం వల్ల, భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు.
నిష్ఠ లేకపోతే దర్శనం ఉండదు
ఇక ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికర నమ్మకం ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే వారు శుద్ధితో పాటు ప్రగాఢ నమ్మకంతో ఉండాలని చెబుతారు. శుద్ధిగా లేకపోయినా, సరైన నిష్ఠ లేని వారు ఆలయాన్ని చేరుకోలేరంటా. ఆలయానికి వెళ్లే మార్గాన్ని మర్చిపోతారని లేదా స్పృహ కోల్పోతారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆలయ ప్రవేశం సాధ్యమవుతుందనేది చాలా మంది విశ్వాసం.
సుందిళ్ల బ్యారేజ్ - ఒక ప్రత్యేక ఆకర్షణ
ఆలయానికి దగ్గరలోనే ప్రసిద్ధ 'సుందిళ్ల బ్యారేజ్' (కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం) ఉంది. ఈ బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఇక్కడ పర్యాటక కళ సంతరించుకుంది. నీటితో కళకళలాడే గోదావరి నది, బ్యారేజ్ వ్యూ పాయింట్లు ఆలయ సందర్శనకు వచ్చే వారికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆలయానికి చేరుకోవడం ఎలా?
హైదరాబాద్ నుండి సుందిళ్ల సుమారు 220 నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్డు మార్గం: హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి (Rajiv Rahadari) ద్వారా సిద్దిపేట, కరీంనగర్ మీదుగా పెద్దపల్లి చేరుకోవాలి. పెద్దపల్లి నుంచి సుమారు 25-30 కి.మీ దూరంలో సుందిళ్ల గ్రామం ఉంటుంది. బస్సు లేదా సొంత వాహనంలో 4 నుండి 5 గంటల్లో చేరుకోవచ్చు.
రైలు మార్గం: హైదరాబాద్ (సికింద్రాబాద్/నాంపల్లి) నుంచి పెద్దపల్లి లేదా రామగుండం రైల్వే స్టేషన్లలో దిగాలి. అక్కడ నుండి ఆటోలు లేదా స్థానిక బస్సుల ద్వారా సుందిళ్ల చేరుకోవచ్చు.
బస్సు మార్గం: మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) లేదా జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుండి గోదావరిఖని లేదా మంథని వెళ్లే బస్సులలో ఎక్కి పెద్దపల్లిలో దిగి వెళ్లవచ్చు.

