Weather Report: వచ్చే 4 రోజులు చాలా జాగ్రత్త.. వాతావరణ శాఖ హెచ్చరిక
Weather Report: మొన్నటి వరకు చలి, వర్షాలతో ఇబ్బందిపడ్డ ప్రజలకు ఇప్పుడు భానుడు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మార్చి ఆరంభంలోనే ఎండ తీవ్రత
మార్చి మొదటి వారమే అయినా తెలంగాణలో వేసవి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్లో మొదలయ్యే మాడే వేడి ఈసారి ఫిబ్రవరి నుంచే ప్రభావం చూపింది. ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావాలంటే ప్రజలు రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. పలు పట్టణాల్లో రోడ్లు మధ్యాహ్నానికి ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ప్రజలు కూలర్లను ఉపయోగించే పరిస్థితి వచ్చింది.
వచ్చే 4 రోజులు జాగ్రత్త
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో వేడి మరింత పెరగనుంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం పొడిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వేడి గాలులు కూడా వీసే అవకాశముండటంతో మధ్యాహ్న వేళల్లో బయట తిరగవద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 34 డిగ్రీల చుట్టూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ స్థాయి క్రమంగా 36 నుంచి 40 డిగ్రీల వరకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం
వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వేడి ప్రభావం అధికంగా ఉండనుంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36–40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది.
అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నా జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.
వాతావరణ మార్పులకు కారణాలేంటి?
వాయవ్య, మధ్య భారత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం ప్రభావం తెలంగాణపై పడుతోంది. మధ్య భారతంలో కొనసాగుతున్న అధికపీడనం కారణంగా వేడి గాలులు రాష్ట్రం వైపు కదులుతున్నాయి. దీనివల్ల రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. దక్షిణ దిశగా సముద్ర ప్రాంతాల వద్ద ఉన్న ఉపరితల ఆవర్తన పరిస్థితులు కూడా పొడిగాలులకు దారితీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎండ మరింత ముదిరే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రజలకు సూచనలు
వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు పొడి వాతావరణం కొనసాగనుంది. కొన్ని చోట్ల ఉదయం వేళల్లో స్వల్ప మేఘావృతం లేదా పొగమంచు కనిపించే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉండగా, కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల దాకా చేరవచ్చు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 21 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండటం మంచిది. తగినంత నీరు తాగడం, లూజ్ దుస్తులు ధరించడం, వృద్ధులు–పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

