కేసీఆర్ ప్లాన్ ఇదీ: ఒంటేరుకు ఆహ్వానం అందుకే
కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే గజ్వేల్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది
గజ్వేల్: కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే గజ్వేల్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మూడు దఫాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల సీఎంలు, ఆయా పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా వ్యవహరించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు వీలుగా ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం కూడ లేకపోలేదు.నల్గొండ ఎంపీ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఈ స్థానం నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.2009, 2014 ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఏడాది క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ లో చేరారు.
సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. దరిమిలా నల్గొండ నుండి కేసీఆర్ పోటీ చేస్తారని చెబుతున్నారు.కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే గజ్వేల్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తోంది.
గజ్వేల్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగితే అభ్యర్ధి ఎవరనే చర్చ లేకపోలేదు. అయితే రెండు మాసాల క్రితం వరకు టీఆర్ఎస్ లోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ తరుణంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి టీఆర్ఎస్ గాలం వేసిందనే ప్రచారం కూడ లేకపోలేదు. కేసీఆర్ రాజీనామా చేస్తే గజ్వేల్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదు.
ఒకవేళ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని భావించి ఎంపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఎమ్మెల్సీ లేదా ఇతర నామినేటేడ్ పదవిని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి కట్టబెట్టే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్న తరుణంలో గజ్వేల్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని కూడ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రతాప్ రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరనున్నారని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
టీఆర్ఎస్లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి