తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను రూ.2,750 కోట్లతో అభివృద్ధి చేస్తున్న కేంద్రం.వాటిలో మూడిటిని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

దేశంలో రైలు ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రయాణికులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశగా ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరించడానికి సుమారు రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు 103 స్టేషన్ల అభివృద్ధి పూర్తయ్యింది.

తెలంగాణలో ఈ పథకం కింద 40 రైల్వే స్టేషన్లకు రూ.2,750 కోట్ల నిధులు కేటాయించి, పునరుద్ధరణ పనులు చేపట్టారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే ఆధునిక మౌలిక సదుపాయాలతో ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఇది హైదరాబాద్ నగరంలో అతిపెద్ద రైల్వే టెర్మినల్‌గా రూపొందింది.

తాజాగా బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పూర్తి అయింది. ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులను తలపించేలా ఈ స్టేషన్ల రూపకల్పన జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు విశాలమైన హాల్లు, ఆధునిక వేటింగ్ రూంలు, డిజిటల్ డిస్ప్లేలు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి.

ప్రత్యేకంగా బేగంపేట స్టేషన్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట వేసారు. ఇక్కడి సేవలు మొత్తం మహిళా ఉద్యోగుల ద్వారానే నిర్వహించనున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ నుండి కీమెన్ వరకు మహిళలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బండి సంజయ్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు హాజరయ్యారు.

ఇక తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతుండగా, కేంద్రం రూ.39,300 కోట్ల వ్యయంతో 2,529 కిలోమీటర్లకు పైగా 22 కొత్త రైల్వే మార్గాల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో వికారాబాద్-కృష్ణా, సికింద్రాబాద్-కాజీపేట, డోర్నకల్-గద్వాల వంటి మార్గాలు ఉన్నాయి. మరికొన్ని మార్గాలు ప్రతిపాదన దశలో ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.ఈ అభివృద్ధి చర్యలు పూర్తయ్యే సరికి తెలంగాణలో రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.