Telangana: తెలంగాణ ప్రభుత్వం బుధవారం అఖిల భారత సర్వీసు (AIS) అధికారులకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. వారి స్థానానికి తగని ప్రజా ప్రవర్తనను నివారించాలని ఆదేశించింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం అఖిల భారత సర్వీసు (AIS) అధికారులకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. విధులకు కట్టుబడి ఉండాలనీ, వారి స్థానానికి తగని ప్రజా ప్రవర్తనను నివారించాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రజా వేదికల్లో విధులకు మించి గీత దాటొద్దని హెచ్చరించింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో.. ఇటీవల అధికారులు ప్రజా సమావేశాలు, సభల్లో తగని ప్రవర్తన ప్రదర్శించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
IAS, IPS, IFS అధికారులతో సహా AIS అధికారుల ఇటువంటి ప్రవర్తన ఇటీవలి సంఘటనల్లో బయటపడిందనీ, ఇది పౌర సేవలను దెబ్బతీస్తుందని ప్రభుత్వం గుర్తించింది.
మెమో ప్రకారం, ఈ చర్యలు "అఖిల భారత సర్వీస్ అధికారులపై చెడు ప్రభావం చూపాయి, సేవల ప్రతిష్టను దెబ్బతీశాయి, వ్యక్తి సేవ చేసే సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి" అని పేర్కొంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు జారీ చేసిన మెమో, అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమాలు, 1968 నియమం 3(1)ని ఉటంకించింది, ఇది "ప్రతి సర్వీస్ సభ్యుడు ఎల్లప్పుడూ సంపూర్ణ సమగ్రత, విధికి అంకితభావాన్ని కలిగి ఉండాలి, సర్వీస్ సభ్యునికి తగని ఏ పని చేయకూడదు" అని నిర్దేశిస్తుంది.
AIS అధికారులు తమ అధికారిక బాధ్యతలు, బహిరంగ ప్రదర్శనలలో ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం, సమగ్రత, మర్యాదను కొనసాగించాలని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు . వీటిని ఉల్లంఘించిన ఏ అధికారి అయినా క్రమశిక్షణా చర్యలకు బాధ్యత వహిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
"ఇకపై, అఖిల భారత సర్వీసుల అధికారులు బహిరంగ సమావేశాలు, సభల్లో సర్వీస్ సభ్యునికి తగని చర్యలు, పనుల్లో పాల్గొనకుండా ఉండాలి. పైన పేర్కొన్న సూచనలను ఉల్లంఘించే ఏ సర్వీస్ సభ్యుడైనా క్రమశిక్షణా చర్యకు బాధ్యత వహిస్తారు" అని మెమోలో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వును అందరు ఐఏఎస్ అధికారులకు పంపించారు. ప్రత్యేకంగా అందరు ఐపీఎస్ అధికారులకు తెలియజేయడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు, ఐఎఫ్ఎస్ అధికారుల కోసం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కు పంపారు.