భయపడొద్దు, ప్రభుత్వంతో మాట్లాడుతా: ఆర్టీసీ జేఎసీ నేతలతో తమిళిసై
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై తాను ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ జేఎసీ నేతలు ఆశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, సుధలు సోమవారం నాడు రాజభవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: మీరు భయపడొద్దు, తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ జేఎసీ నేతలకు సూచించారు. చర్చల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
read also:అమ్మా చొరవచూపండి: గవర్నర్ తమిళసైతో టీఎస్ఆర్టీసీ జేఏసీ భేటీ
ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. హైకోర్టు చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేసినా కూడ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చించలేదు. దీంతో ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి చేసిన సూచనల విషయమై గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ జేఎసీ నేతలు వివరించారు.
read alsoRTC Strike:కేసీఆర్ మొండిపట్టు, జేఎసీ నేతలకు తమిళిసై దిక్కు
ఆర్టీసీ కార్మికులతో ఈ నెల 19వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
హైకోర్టు కాపీ అందలేదనే సాకుతో తమతో ప్రభుత్వం చర్చలు జరపలేదని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు సూచించిన గడువు దాటిపోయింది. అయినా కూడప్రభుత్వంలో చలనం లేకపోవడంతో జేఎసీ నేతలు ఆందోళనతో ఉన్నారు.
ఈ పరిణామాలను ఆర్టీసీ జేఎసీ నేతలు ఆశ్వత్థామరెడ్డితో పాటు జేఎసీ కో-కన్వీనర్లు కె.రాజిరెడ్డి, వీఎస్ రావు, ఒ.సుధ గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న సమయంలో అద్దె బస్సులను తీసుకోవడానికి వీల్లేదని నిబంధలు ఉన్న విషయాన్ని జేఎసీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 25 శాతానికి మించి ప్రభుత్వం అద్దె బస్సులను నడుపుతోందని జేఎసీ నేతలు గవర్నర్ కు వివరించారు.
ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై ఆర్టీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి లేకుండానే 1,035 అద్దె బస్సులకు టెండర్ జారీ చేశాయని జేఎసీ నేతలు గవర్నర్ కు చెప్పారు. ఈ విషయమై తాను ప్రభుత్వంతో మాట్లాడుతానని గవర్నర్ ఆర్టీసీ జేఎసీ నేతలకు చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె సమయంలో ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆమె స్పందించారు. ఆత్మహత్యలు చేసుకోకుండా కార్మికుల్లో ధైర్యం నింపాలని ఆమె జేఎసీ నేతలకు సూచించారు.
read also;RTC Strike: జీతాల చెల్లింపుపై చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.ఈ పిలుపులో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.