Narendra Modi : నేడు హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. మూడు రోజుల పాటూ తెలంగాణలోనే..
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన రాజభవన్ కు చేరుకుని రాత్రికి రాజభవన్ లో బస చేస్తారు.
![Prime Minister Modi to Hyderabad today, in Telangana for three days - bsb Prime Minister Modi to Hyderabad today, in Telangana for three days - bsb](https://static-ai.asianetnews.com/images/01hfr5m97sat66qn6e3n42w5kb/PM--narendra-modi-Mega-Road-Show-1700544521465_363x203xt.jpg)
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. శనివారం నాడు హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 26, 27వ తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 26వ తేదీన సాయంత్రం మోడీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారని… 27వ తేదీ ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు.దర్శనానంతరం తిరుపతి నుంచి మళ్లీ హైదరాబాదుకు బయలుదేరి వెళ్తారని.. ఈ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వివిఐపి పర్యటన నిబంధన ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సిఎస్ సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా..అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
Top Stories : రైతుబంధు పంపిణీ షురూ, రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్...మెట్రోలో కేటీఆర్...
తెలంగాణలో శనివారం నాడు కామారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. నవంబర్ 26 వ తేదీ ఆదివారం నాడు తూఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ లతో పాటు హైదరాబాదులో రోడ్ షోలో పాల్గొంటారు. శనివారం 1.25 నిమిషాలకు దుండిగల్ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని అక్కడి నుంచి 2.05 ని.కు కామారెడ్డిలో జరిగే బిజెపి బహిరంగ సభకు చేరుకుంటారు.మూడు గంటల వరకు ఆ సభలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.05ని.కు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు. 4.55వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7:35ని.లకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన రాజభవన్ కు చేరుకుని రాత్రికి రాజభవన్ లో బస చేస్తారు. 26వ తేదీన నిర్మల్, దుబ్బాకలో జరిగే పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు దుబ్బాకకు చేరుకుంటారు. నిర్వహించే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగున్నర వరకు నిర్మల్ బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని తిరుపతికి బయలుదేరి వెళ్తారు.
సోమవారం 27వ తేదీన మహబూబాబాద్ కరీంనగర్ లో జరిగే బిజెపి పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటారు. అనంతరం హైదరాబాదులో రోడ్డు షో తో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగుస్తుంది. నవంబర్ 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాదులో రోడ్ షో లో నరేంద్ర మోడీ పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోతారు.