Top Stories : రైతుబంధు పంపిణీ షురూ, రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్...మెట్రోలో కేటీఆర్...
అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లోని వార్తాకథనాల సమాహారం టాప్ స్టోరీస్. తెలంగాణలో ప్రచారానికి గడువు దగ్గర పడుతోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీలో కులగణన... ఇలాంటి టాప్ టెన్ వార్తలు మీ కోసం..
![Top Stories : Rythubandhu disbursement begins, job calendar with two lakh jobs...KTR in Metro - bsb Top Stories : Rythubandhu disbursement begins, job calendar with two lakh jobs...KTR in Metro - bsb](https://static-ai.asianetnews.com/images/01f3ysq1g81ea2hnbqszebby9k/kcr-ktr-jpeg_363x203xt.jpg)
రైతులకు గుడ్ న్యూస్ : రైతుబంధు పంపిణీకి ఈసీ ఓకే
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలవేళ రైతులకు గుడ్ న్యూస్ వినిపించింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాసంగి కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణి చేయొచ్చు అంటూ శుక్రవారం రాత్రి అనుమతినిచ్చింది. ఈ నెల 28వ తారీకు వరకు చెల్లింపులు చేపట్టొచ్చని తెలిపింది. 2018 అక్టోబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ చెల్లింపులు ఉండాలని స్పష్టం చేసింది. ఒక్కో సీజన్ కు ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని రెండు సీజన్లకు కలిసి మొత్తం పదివేల రూపాయలను రైతుబంధుగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు మొదటి పేజీలో ప్రచురించింది.
గుడ్ న్యూస్.. రైతుబంధు నగదు పంపిణీకి ఈసీ ఆమోదం..
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : ప్రియాంక గాంధీ
తెలంగాణలోని తొర్రూరు హుస్నాబాద్ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ శుక్రవారం నాడు ప్రచారం చేపట్టారు. ఈ సభల్లో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఎన్నికలలో ఇచ్చిన మాట కాదని..రాజస్థాన్లో ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. తెలంగాణలో పదేళ్లుగా పాతుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదలకు పోడు పట్టాలు, ఇళ్ళ భూములు ఇవ్వలేదన్నారు. ఇసుక, నీరు, భూమి..ఉద్యోగాలు అన్నిట్లోనూ కుంభకోణాలే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని.. ఈనాడు బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.
సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం మందలింపు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని.. సీఈసీ అడ్వైజరి లేఖ రాసింది. టిఆర్ఎస్ అధ్యక్షుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన.. అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ముఖ్యమంత్రికి రాసింది. ఈ లేఖను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి శుక్రవారం పంపుతూ దానిని కేసీఆర్కు అందించాలని సూచించింది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని, అలా మాట్లాడితే వారికి సంబంధించిన పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని అందులో తెలిపింది. ప్రస్తుతం దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదని, రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని.. సిఈసి లేఖలో పేర్కొంది. దీనికి కారణం గత నెల 30వ తేదీన కెసిఆర్.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరిగిన ఎన్నికల సభలో దుబ్బాక అభ్యర్థి పై కత్తిపోట్ల సంఘటన మీద ప్రతిపక్ష పార్టీలపై పరుష పదజారులతో విరుచుకుపడ్డారు, రెచ్చగొట్టేలా మాట్లాడారు అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకే ఈ లేఖ రాసింది. ఈనాడు ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించింది.
మే 26వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్
వచ్చే ఏడాది మే 26వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలో బీటెక్ ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈసారి 2024 -25కు గాను ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటి మద్రాస్ తీసుకుంది. దీంట్లో భాగంగానే జేఈఈ అడ్వాన్స్ 2024 వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. జై మెయిన్లో కనీస మార్కులు సాధించిన రెండున్నర లక్షల మంది మాత్రమే అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనాడు పూర్తి వార్తను ప్రచురించింది.
ఈనెల 26, 27 వ తేదీల్లో తిరుమలకు ప్రధాని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఈనెల 26 27వ తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం మోడీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారని… 27వ తేదీ ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు.దర్శనానంతరం తిరుపతి నుంచి మళ్లీ హైదరాబాదుకు బయలుదేరి వెళ్తారని.. ఈ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి మెయిన్ పేజీలో ప్రచురించింది.
డిసెంబర్ 9 నుంచి ఏపీలో కులగనన
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొద్ది నెలల గడువుండగా అక్కడ కులగణనపై ఇప్పుడు చర్చ మరింతగా వేడెక్కుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించినున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని ఆయన అన్నారు. కులాలతోపాటు అన్ని వర్గాల పేదల తలరాతలు మార్చడానికి సమగ్ర కులగణనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారని.. ఈ మేరకు తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి ప్రముఖంగా ప్రచురించింది.
నవరత్నాల వెలుగులు…
ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో అభివృద్ధి, సంక్షేమం ఎలా జరిగిందో చెబుతూ ఒక ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించింది. నాలుగేళ్లుగా నవరత్నాలు యజ్ఞం కొనసాగుతుందని.. మానవ అభివృద్ధి ధ్యేయంగా పథకాల అమలు జరుగుతోందని.. ఈ నవరత్నాలతో జీవన స్థాయిలు పెరిగి, పేద వర్గాలు ముందడుగు వేస్తున్నారని రాసుకొచ్చింది. అమ్మ ఒడి. రైతుకు భరోసా, నాడు నేడు, విద్యా కానుక, గోరుముద్ద, వసతి జీవన, ఆరోగ్యశ్రీలో చేసిన సేవలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ఈ వార్తాకథనంలో సాక్షి చెప్పుకొచ్చారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో తనిఖీలు
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 23లో ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్. దీంతో అర్ధరాత్రి జూబ్లీహిల్స్ లో ఉద్రిక్త వాతావరణం, హై డ్రామా చోటు చేసుకుంది, ఏకే గోయల్ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సలహాదారుగా పనిచేశారు. ఆయన ఇంట్లో భారీగా నగదును డంప్ చేశారని, అక్కడి నుంచి అధికార పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాలకు డబ్బు తరలిస్తున్నారని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఏకే గోయల్ ఇంటికి చేరుకున్న సర్వేలైన్స్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ సమాచారం అందడంతో కాంగ్రెస్ నేతలైన మల్లురవి, అజారుద్దీన్ సహ తదితర నేతలు కూడా అక్కడికి తరలివచ్చారు. గోయల్ ఇంట్లో రెండు గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఏమి దొరకలేదంటూ అధికారులు వెనుదిరిగారు. దీంతో ఆగ్రహానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో లాటీ ఛార్జ్ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ప్రచురించింది.
కారులో రూ. కోటి బుగ్గిపాలు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతుంది. ఈ క్రమంలో ఓ కారులో చెలరేగిన మంటలతో బ్యానెట్లో ఉంచిన కోటి రూపాయలు నగదు బుగ్గిపాలయ్యింది. మామునూరు ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు నగదును గమనించి రూ.5-6 లక్షల వరకు ఎత్తుకెళ్లినట్లుగా సమాచారం. కారులోని వ్యక్తులు మరికొంత డబ్బుతో పారిపోయారు. దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వార్తను మెయిన్ పేజీలో ఆంధ్రజ్యోతి ప్రచురించింది.
మేమూ మనుషులమే.. పొరపాట్లు చేసే ఉంటాం : కేటీఆర్
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మెట్రోలో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మె 2023లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. హఠాత్తుగా కేటీఆర్ రైలులో ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. మహిళలు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. 20 నిమిషాల పాటు ఈ ప్రయాణంలో కేటీఆర్ ఐటి ఉద్యోగులు, విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కథనంలోనే మరో వార్తగా మేము మనుషులమే…తప్పులు, పొరపాట్లు సహజంగా చేసి ఉంటాం... వాటిని సర్దుకుని ముందుకు పోతాం..అని కేటీఆర్ అన్న మాటలను వార్తగా ప్రచురించారు. కాంగ్రెస్ కోరుకునే మార్పు దేనికోసం.. ఆరు నెలలకోసారి సీఎంను మార్చడం కోసమా.. అని ఎడిటర్ల ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడిన మాటలను ప్రచురించింది.
- A.K. Goel
- Andhra Pradesh
- Election commission
- Election squads
- Farmers
- Hyderabad metro
- IAS officer
- YS Jaganmohan reddy
- bharat rashtra samithi
- bharatiya janata party
- job calendar
- kalvakuntla chandrashekar rao
- kalvakuntla taraka rama rao
- priyanka gandhi
- rythu bandhu
- telagana congress
- telangana assembly elections 2023
- telangana elections 2023
- top stories
- warangal district