Medicover Hospitals: మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు 61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియా వ్యాధికి POEM చికిత్స చేసి విజయం సాధించారు. ఆ మహిళకు కొత్త జీవితం అందించారు.

Medicover Hospitals: సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ఒక అరుదైన చికిత్సతో వైద్యరంగంలో మరో విజయాన్ని అందుకుంది. అకలేషియా కార్డియా అనే వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు అధునాతన Per Oral Endoscopic Myotomy (POEM) చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రక్రియ ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స కోతలు లేకుండా ఆ మహిళకు కొత్త జీవితాన్ని అందించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ద్రవాలు కూడా మింగలేని పరిస్థితిలో రోగి

బాధిత రోగి ఆహారం మింగడంలో తీవ్రమైన ఇబ్బందితో బాధపడుతూ మెడికవర్ వైద్యులను సంప్రదించారు. దగ్గు, వాంతులు, ఛాతిలో మంట వంటి లక్షణాలు క్రమంగా పెరిగాయి. చివరికి, ఆమె ద్రవాలను కూడా మింగలేని స్థితికి చేరుకున్నారు. ప్రారంభంలో చేసిన CT స్కాన్‌లో ఆమె అన్నవాహిక గణనీయంగా పరిమాణం పెరిగినట్టు వైద్యులు గుర్తించారు.

అకలేషియా కార్డియా నిర్ధారణ

తదుపరి పరీక్షలైన ఎండోస్కోపీ, హై-రిజల్యూషన్ మానోమెట్రీ ద్వారా రోగికి అకలేషియా కార్డియా ఉన్నట్లు స్పష్టంగా నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ (LES) సడలకపోవడం ప్రధాన సమస్య. దీని కారణంగా ఆహారం అన్నవాహికలో నిలిచిపోయి, బరువు తగ్గడం, ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం పెరుగుతుంది. సాధారణ ఆమ్లత్వం లేదా చిన్న మింగుడు సమస్యగా లక్షణాలు కనిపించడం వల్ల చాలా అకలేషియా కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని వైద్య బృందం వెల్లడించింది.

విజయవంతంగా POEM చికిత్స

ఈ సవాలుతో కూడిన కేసులో, మెడికవర్ గ్యాస్ట్రోఎంటరాలజీ బృందం వినూత్న POEM ప్రక్రియను ఎంచుకుంది. ఈ విధానంలో బయట ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా ఎండోస్కోపిక్ పద్ధతిలో చికిత్స నిర్వహించారు. ప్రత్యేక ఎండోస్కోపిక్ సాధనాలను ఉపయోగించి లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్‌కు సంబంధించిన కండరాలను విడదీశారు. తద్వారా అన్నవాహికకు అడ్డుపడుతున్న అడ్డంకిని విజయవంతంగా తొలగించారు. చికిత్స పూర్తైన మరుసటి రోజే రోగి ద్రవాలు తీసుకునే స్థితికి చేరుకుందని తెలిపారు.

అవగాహన ముఖ్యమన్న డాక్టర్ కృష్ణ గోపాల్

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. కృష్ణ గోపాల్ మాట్లాడుతూ... “POEM వంటి ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతులు అన్నవాహిక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాయి” అని ఆయన అన్నారు. “మింగడంలో ఇబ్బంది, ఛాతీ మంట లేదా దీర్ఘకాలిక ఆమ్లత్వం వంటి లక్షణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు.

సమయానికి వైద్యులను సంప్రదిస్తే అకలేషియా కార్డియా వంటి అరుదైన సమస్యలను శస్త్రచికిత్స అవసరం లేకుండా సురక్షితంగా, విజయవంతంగా చికిత్స చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతికత, నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో మెడికవర్ గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో విశిష్ట విజయాలను కొనసాగిస్తోంది.