అసెంబ్లీ రద్దు: నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నేడు కేసీఆర్
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ కూడ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలు వెళ్లారు
హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ కూడ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలు వెళ్లారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కేసీఆర్ నిర్ణీత సమయానికి కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కూడ ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983లో ఎన్టీఆర్ .. టీడీపీని ఏర్పాటు చేసి అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే గుండె ఆపరేషన్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు.
ఎన్టీఆర్ అమెరికా నుండి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది.1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు
సీఎం అయ్యారు.
దీంతో ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో ఆనాడు కాంగ్రెసేతర పార్టీలన్నీ ఎన్టీఆర్ కు అండగా నిలిచాయి. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ను సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా నియమించారు.
నాదెండ్ల భాస్కర్ రావు వర్గంలో కూడ కొందరు ఎమ్మెల్యేలు చేరడంతో ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతోందనే భావనతో ఆయన ముందుగానే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాడు. 1984 నవంబర్ 22న ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశాడు. ఎన్నికలకు వెళ్లాడు.
ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. 1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. 1985లో ఎన్టీఆర్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
ఈ సమయంలో కూడ పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ముందస్తుకు వెళ్లాడు. అయితే 1989లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1999లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉండేవారు. 2003 అక్టోబర్ 1 వ తేదీన అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో చంద్రబాబునాయుడుపై మావోయిస్టులు దాడి చేశారు. మందుపాతర పేల్చడంతో తృటిలో ప్రాణాపాయం నుండి బాబు తప్పించుకొన్నారు. అయితే ఎన్నికలకు 8 మాసాల ముందే చంద్రబాబునాయుడు అసెంబ్లీని రద్దు చేశారు.
అలిపిరి ఘటనను రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావించాడు. కానీ, రాజకీయంగా ఆ ఎన్నికల్లో బాబుకు కలిసిరాలేదు. కేవలం ఈ ఎన్నికల్లో 47 సీట్లకే టీడీపీ పరిమితమైంది.
2014 జూన్ రెండో తేదిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధారణ మెజారిటీతో విజయం సాధించింది. అయితే మరో 8 మాసాల వరకు టీఆర్ఎస్ సర్కార్ కు పాలన చేసే అవకాశం ఉంది.
1546 రోజలు సీఎంగా పాలన చేసిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 4 ఏళ్ల మూడు మాసాల 4 రోజుల్లోనే అసెంబ్లీని రద్దు చేశారు. అయితే ఈ దఫా ఎన్నికల ఫలితాలు ఉంటాయనే విషయమై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు చదవండి
రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే
కొండా సురేఖ టిక్కెట్టుపై వీడని సస్పెన్స్, ఎందుకంటే?
అసెంబ్లీ రద్దు: గుజరాత్ తీర్పు ఏం చెబుతోంది?