IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Telangana Weather : రాబోయే రోజుల్లో మరోసారి భారీ వర్షాలు తప్పవని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. గత ఫిబ్రవరిలో కురిసిన వర్షాలకంటే ఈసారి మరింత ఎక్కువ వర్షాలుంటాయని హెచ్చరించారు.

తెలంగాణకు చల్లని కబురు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి... 35 నుండి 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటిది ఈ నెలలోనే (మార్చి 2026) లో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వానలు ఎండలతో సతమతం అవుతున్న తెలుగు ప్రజలకు ఊరట ఇవ్వనున్నాయి.
మార్చిలో వర్షాలు
తెలంగాణలో ఈ మార్చి చివర్లో అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల మధ్యలో అంటే 18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని... ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 39 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. హైదరాబాద్ లో 36 నుండి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో అప్పుడే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు
ప్రస్తుతం తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్ లో నమోదవుతున్నాయి... నిన్న (మార్చి 4, బుధవారం) పగటిపూట ఏకంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడి భగభగలు కొనసాగాయి. ఇక భద్రాచలంలో 38.5, ఖమ్మంలో 38, నిజామాబాద్ లో 36.9, రామగుండంలో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే హకీంపేటలో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
ఇకపై తెలంగాణవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్ నుండి జోగులాంబ గద్వాల వరకు అన్నిజిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. మార్చి 8 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా వేసవి సెగ గట్టిగానే తాకుతోంది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని... కొన్నిప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, కర్నూల్, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఎండల నుండి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.

