కొడతారేమో: గవర్నర్, రేవంత్ మధ్య ఆసక్తికరం
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ నరసింహాన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. కొడతారని భయపడి రాలేదని రేవంత్ వ్యాఖ్యలతో ఎట్ హోం కార్యక్రమంలో అంతా నవ్వారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ నరసింహాన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి, గవర్నర్ కు మధ్య ఈ సంభాషణ చోటు చేసుకొంది.
ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ నరసింహాన్ పలకరిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి వద్దకు రాగానే గవర్నర్ ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. వచ్చావా... రాలేదేమోనని నీ కోసమే చూస్తున్నా అని గవర్నర్ అడిగారు. మీరు పిలిస్తే రాకుండా ఉంటానా అని రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
నన్ను కలిసేందుకు వస్తానన్నారుగా ఎందుకు రాలేదని ఆయన రేవంత్ ను ప్రశ్నించారు. కొడతారేమోనని రాలేదని రేవంత్ రెడ్డి నవ్వుతూ చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చోటు చేసుకొన్న అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారు.
నేను కొట్టానా..మీరు నన్ను కొట్టారా... అంటూ ఆయన అసెంబ్లీలో గవర్నర్ కుర్చీ లాగిన ఘటనను గుర్తు చేశారు. ఈ ఘటనను మనసులో పెట్టుకొని ఎక్కడ కొడతారేమోనని రాలేదని రేవంత్ రెడ్డి చమత్కరించారు. దీంతో అక్కడ అందరూ నవ్వారు.
నా పై కోపంగా ఉన్నారా అని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని గవర్నర్ ప్రశ్నించారు. షబ్బీర్ అలీ పక్కనే రేవంత్ రెడ్డి ఉన్నాడు. షబ్బీర్ అన్న బిర్యానీ పెడతాడు తప్ప ఎవరినీ కోపగించుకోడని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ సమయంలో పక్కనే ఉన్న గవర్నర్ సతీమణి విమలా నరసింహాన్ జోక్యం చేసుకొన్నారు.గవర్నర్ బిర్యానీ తినడు కదా అని ఆమె చెప్పారు. దీంతో అందరూ నవ్వారు.
ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: గవర్నర్ తో కేసీఆర్ మాట ఇదీ....
రాజ్భవన్లో ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
రాజ్భవన్లో గవర్నర్ ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్