సౌదీ అరేబియా నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం అహ్మదాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. 

Bomb Threat : సౌదీ అరేబియాలోని మదీనా నుండి ఇండియాకు వస్తున్న ఓ ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు రావాల్సిన విమానం మార్గమధ్యలో అహ్మదాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఇవాళ (గురువారం, డిసెంబర్ 04) ఉదయం 11.30 గంటల సమయంలో ఇండిగో విమానాన్ని దారిమళ్లించారు.

సౌదీ అరేబియా నుండి హైదరాబాద్ కు 180 ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది. విమానం ఆకాశంలో ఉండగా తనవద్ద బాంబులు ఉన్నాయి... దీన్ని పేల్చేస్తానంటూ ఓ ప్రయాణికుడు బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది గ్రౌండ్ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

అప్పటికే సిద్దంగా ఉన్న భద్రతా సిబ్బంది విమానంలో ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు... కానీ ఎవరివద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. బాంబులు ఉన్నాయన్న ప్రయాణికుడి వద్దకూడా అనుమాస్పదమైన వస్తువులేవీ దొరకలేవు. అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.

విమానానికి బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది... ఈ విమానంలోని అత్యధికులు తెలుగువారే కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. బాంబ్ స్క్వాడ్ తనిఖీ తర్వాత విమానంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల తర్వాత విమానం అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది... ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నారు.