హైదరాబాదీలకు మరో శుభవార్త. నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త ఇది. నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ రహదారి ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్కు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. ఈ ఫ్లైఓవర్ను జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇది ప్రారంభమైతే గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ స్పష్టంగా తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది.
ప్రాజెక్ట్ హైలైట్స్
ఈ మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (SRDP) కింద నిర్మించారు. దాదాపు రూ.178 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నిర్మాణం 1.2 కిలోమీటర్లు పొడవు, 24 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. ఆరు లేన్లతో రూపొందించిన ఈ ఫ్లైఓవర్, ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్ల పైన నిర్మించారు.
ట్రాఫిక్ సమస్యలకు చెక్
ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లే వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు ట్రాఫిక్ జామ్ లేకుండా వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. గంటల తరబడి ట్రాఫిక్లో నిలిచే పరిస్థితికి ఇక ముగింపు పలుకుతుంది.
గచ్చిబౌలికి మెరుగైన మార్గాలు
ఈ ఫ్లైఓవర్తో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కొండాపూర్ వరకు, అలాగే తిరిగి వచ్చే దారిలో ప్రయాణం సౌకర్యంగా మారుతుంది. అనవసరమైన ట్రాఫిక్ లూప్స్ లేకుండా నేరుగా అవసరమైన మార్గాల్లోకి ప్రవేశించవచ్చు.