hyderabad fire accident: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
hyderabad fire accident: హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో మే 15న ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డజన్ల మంది ప్రాణాలు తీసుకుని తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించనున్నట్లు ప్రకటించారు.
అగ్నిప్రమాదం ఉదయం 6.16 గంటలకు సమాచారం అందిందనీ, వెంటనే మొగల్పూర ఫైర్ ఇంజిన్ 6.17కి బయలుదేరి 6.20కి ఘటనా స్థలానికి చేరిందని అధికారులు తెలిపారు. మొత్తం 11 ఫైర్ ఇంజిన్లతో పాటు ఒక రోబోను ఉపయోగించి 70 మంది అగ్నిమాపక సిబ్బంది మంటల నియంత్రణలో పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికల్లో వెల్లడిస్తున్నాయని తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసముండగా, గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో బంధువులు అక్కడే ఉండగా, మంటలు చెలరేగాయి. ఇంట్లోకి పొగ ప్రవేశించడంతో ఊపిరాడక పలువురు స్పృహ కోల్పోయారు.
ఇంట్లోకి వెళ్లే మార్గం ఒక్కటి మాత్రమే ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల సాయంతో పై అంతస్తుల్లోకి వెళ్లి తలుపులు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకువచ్చారు. అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించే క్రమంలో కొందరు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఈ ఘటనపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరుగుతుందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
చార్మినార్ గుల్జార్హౌస్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
హైదరాబాద్ చార్మినార్ లోని గుల్జార్హౌస్లో ఘోర అగ్నిప్రమాద ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. 17 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోడీ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పరిహారాన్ని ప్రధాని జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి విడుదల చేయనున్నారు.