హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప‌లువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.  

ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే విధంగా, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతీ మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సహాయం, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఆదివారం ఉదయం గుల్జార్‌ హౌస్‌లోని ఓ వాణిజ్య భవనంలో మొదటి అంతస్తు నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 16 మంది మరణించారు, అందులో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మంటల నుంచి బయటపడిన వారిలో పలువురిని ఉస్మానియా, మలక్‌పేట యశోద, డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల‌కు ప్ర‌స్తుతం ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వ‌హిస్తున్నారు.