హైదరాబాద్ నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. దేశంలోని నలుమూలల నుంచి హైదరాబాద్కు విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం క్యూ కడుతున్నారు. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా పెరుగుతోంది.
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
కరీనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి ఉన్న మార్గం రాజీవ్ రహదారి. అయితే అల్వాల్ వరకు సాఫీగా సాగే ప్రయాణం అక్కడి నుంచి ట్రాఫిక్తో ఇబ్బందిగా మారుతుంది. జేబీఎస్ నుంచి హకీం పేట వరకు ఫ్లై ఓవర్ నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అదే విధంగా ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ వరకు కూడా ఇదే ప్రతిపాదన ఉంది.
అయితే ఈ మార్గంలో ఎక్కువగా డిఫెన్స్ భూములు ఉండడంతో అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా ఈ మార్గాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణానికి మార్గం సుగుమం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే శామీర్పేట ఓఆర్ఆర్ నుంచి కేవలం 30 నిమిషాల్లో జేబీఎస్ చేరుకోవచ్చు. దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్కి బూస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
రక్షణశాఖకు భూమి బదిలీకి HMDA సన్నద్ధం
ఈ ప్రాజెక్టుల కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) 160 ఎకరాల రక్షణ శాఖ భూమిని తీసుకోవాల్సి ఉండగా ఇందుకు ప్రతిగా 330 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షణ మంత్రిత్వ శాఖకు (MoD) బదిలీ చేయనుంది. ఈ భూములు జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ సర్కిల్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ (మెడ్చల్ రోడ్) వరకు నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కీలకంగా మారనుంది.
ప్రాజెక్టు ఆలస్యానికి ఇదే ప్రధాన కారణం
ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణం రక్షణ భూముల విషయంలో అనేక నిబంధనలు, అనుమతుల తాలూకు జాప్యమేనని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. రక్షణ శాఖతో ఒప్పందం కుదిరిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రాథమిక పనులను ప్రారంభించిన HMDA
ప్రస్తుతం HMDA కొంత మేర పనులు ప్రారంభించింది. ముఖ్యంగా కంటోన్మెంట్, రక్షణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం నాలుగు అండర్గ్రౌండ్ సంప్లు నిర్మిస్తోంది. కాంపౌండ్ వాల్ టెండర్లు పూర్తయ్యాయి. బేగంపేట, హకీంపేట విమానాశ్రయాల్లో అండర్గ్రౌండ్ టన్నెళ్లకు సంబంధించిన టెక్నికల్ స్టడీస్ కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో టన్నెళ్ల కోసం 26 ఎకరాల భూమి అవసరం.
ఎంత భూమి కావాల్సి ఉందంటే
శామీర్పేట కారిడార్ కోసం 114 ఎకరాల రక్షణ భూమి, 78 ఎకరాల ప్రైవేట్ భూమి అవసరం. డెయిరీ ఫామ్ రోడ్ కారిడార్కు 42 ఎకరాల రక్షణ భూమి, 13 ఎకరాల ప్రైవేట్ భూమి అవసరం. అన్ని చట్టబద్ధ పద్ధతుల్లో సర్వేలు, సమాజ ఆర్థిక అధ్యయనాలు చేపట్టి ప్రైవేట్ భూములు సేకరిస్తున్నారు.