- Home
- Telangana
- KCR : కొడుకు, కూతురు ఇద్దరికీ కాదు... మరొకరికి బిఆర్ఎస్ పగ్గాలు? కేసీఆర్ ఆల్రెడీ సంకేతాలిస్తున్నారా?
KCR : కొడుకు, కూతురు ఇద్దరికీ కాదు... మరొకరికి బిఆర్ఎస్ పగ్గాలు? కేసీఆర్ ఆల్రెడీ సంకేతాలిస్తున్నారా?
బిడ్డలిద్దరి గొడవ మధ్య ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా? అందుకే మధ్యేమార్గంగా పార్టీలో తనతోపాటు ప్రయానం సాగించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు... హరీష్ రావు నేతృత్వం
Telangana Formation Day 2025 : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కానీ తెలంగాణ తెచ్చామని చెప్పుకునే ఒకప్పటి ఉద్యమపార్టీ, నేటి రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితిలో మాత్రం మునుపటి జోష్ కనిపించడంలేదు. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉండటం, కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం, కల్వకుంట్ల కుటుంబంలో వివాదాల కారణంగా తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కళ తప్పాయి. మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నాయకులతో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కానియ్యాల్సి వచ్చింది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ దూరం?
చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చానని చెప్పుకునే కేసీఆర్ కు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమయం లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలే కాదు ప్రజలు సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంటేనే తెలంగాణ గుర్తుంటుందా? లేకుంటే పట్టించుకోరా? అని సోషల్ మీడియా వేదికన ప్రశ్నిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ శ్రేణులయితే ''ఫార్మ్ హౌస్ లో కూర్చుని పార్టీలు చేసుకుంటూ జల్సాలు చేసేందుకు ఫుల్ టైమ్ ఉంటుంది.. కానీ తెలంగాణ అమరులను గుర్తుచేసుకుని అవతరణ దినోత్సవంలో పాల్గొనేందుకు మాత్రం టైమ్ ఉండదు.. ఈయనా తెలంగాణ జాతిపిత?'' అంటూ మండిపడుతున్నారు. కేటీఆర్, కవిత పై కూడా విరుచుకుపడుతున్నారు… తండ్రి వారసత్వం కోసం గొడవపడుతున్న వీరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎలా గుర్తుంటుందని అంటున్నారు.
ఇలా తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గానీ... కొడుకు కేటీఆర్, కూతురు కవిత గానీ హాజరుకాకపోవడంపై పెద్ద చర్చే సాగుతోంది. కేవలం హరీష్ రావుతో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులు మాత్రమే పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఇది మరో కొత్త వాదనకు కూడా తెరతీసింది. ఈ వేడుకల ద్వారా కేసీఆర్ కొత్త సంకేతాలేమైనా ఇస్తున్నారా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.
హరీష్ రావుకు బిఆర్ఎస్ పగ్గాలు అప్పగిస్తారా?
పదేళ్లకు పైగా ఉద్యమం... మరో పదేళ్లపాటు పాలన... ఏడాదికి పైగా ప్రతిపక్షం... ఇలా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన పార్టీ బిఆర్ఎస్. ఇలా రెండు దశాబ్దాలకు పైగా ఈ పార్టీని ముందుండి నడిపించారు కేసీఆర్. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటున్నారు. ఇదే కల్వకుంట్ల కుటుంబంలో మరీముఖ్యంగా కేసీఆర్ సొంత బిడ్డల మధ్య విబేధాలకు కారణమయ్యింది.
తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం కొడుకు కేటీఆర్, కూతురు కవిత మధ్య వైరం సాగుతోంది. ఇప్పటికే కేసీఆర్ కాకుండా ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోనని కవిత స్పష్టం చేసారు... దీన్ని బట్టి సొంత అన్న కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఆమెకు ఇష్టం లేదని అర్థమవుతోంది. ఇలా ఇప్పటికే కొడుకుకు పార్టీని అప్పగించాలని ముందునుండే వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్న కేసీఆర్ సొంత కూతురు అడ్డుపడింది. దీంతో కేసీఆర్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
బిడ్డలిద్దరి గొడవలో ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా? అందుకే మధ్యేమార్గంగా పార్టీలో తనతోపాటు ప్రయాణం సాగించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. కవిత వివాదం తర్వాత కేసీఆర్ తో హరీష్ పలుమార్లు భేటీకావడంతో ఈ ప్రచారం మొదలయ్యింది. తాజాగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ ప్రచారానికి మరింత బలం వచ్చింది.
తెలంగాణ భవన్ లో పార్టీ అధ్యక్షుడు చేపట్టాల్సిన జెండా ఆవిష్కణను హరీష్ రావు చేత చేయించడం ద్వారా కేసీఆర్ కొత్త సంకేతాలు ఇచ్చారన్న రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేటీఆర్ విదేశాల్లో, కవిత తన జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోగా హరీష్ రావు తెలంగాణ భవన్ లో అన్నీతానై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా… pic.twitter.com/8I0na5VzMy— BRS Party (@BRSparty) June 2, 2025
మామ కేసీఆర్ గురించి హరీష్ ఆసక్తికర కామెంట్స్
హరీష్ రావుకు బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం వేళ మామ కేసీఆర్ ను కొనియాడుతూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూనే కేసీఆర్ ను కొనియాడారు హరీష్.
''దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం... సాకారమైన సుదినం నేడు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో... కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు'' అని తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ పోరాటాన్ని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు.
''సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ. స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ'' అంటూ ఎక్స్ వేదికన స్పందించారు హరీష్ రావు.
హరీష్ నాయకత్వాన్ని కేటీఆర్, కవిత అంగీకరిస్తారా?
కేసీఆర్ కాకుండా ఎవరినీ నాయకుడిగా అంగీకరించనని కవిత స్పష్టం చెప్పారు... అంటే అన్న కేటీఆర్ నే కాదు బావ హరీష్ రావును కూడా ఆమె అంగీకరించను అన్నట్లే. ఇక కేటీఆర్ ఇంతకాలంగా అధికారికంగా కాకున్నా అనధికారంగా పార్టీ అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారు. పేరుకు మాత్రమే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. హరీష్ ను అధ్యక్షుడిగా ఈయన కూడా అంగీకరించే అవకాశమే లేదు. కానీ కేసీఆర్ హరీష్ కు ఎందుకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు? అంటే బిఆర్ఎస్ క్యాడర్ లో కన్ఫ్యూజన్ ను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారట.
కేటీఆర్, కవిత ఇద్దరిలో ఎవరికి బిఆర్ఎస్ పగ్గాలు అప్పగించినా పార్టీ రెండుగా చీలిపోవడం ఖాయం. అలాకాకుండా హరీష్ ను అధ్యక్షుడిగా చేసి వెనకుండా తానే పార్టీని నడిపిస్తే ఈ గ్రూప్ తగాదాలు ఉండవు. కేటీఆర్, కవిత అసంతృప్తికి గురికావచ్చు.. కానీ కేసీఆర్ ను కాదని ఏం చేయలేరు. పార్టీ లీడర్లు, క్యాడర్ కూడా చెల్లాచెదురయ్యే అవకాశం ఉండదు.
మరోవైపు హరీష్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది... ట్రబుల్ షూటర్ గా పేరుంది. ప్రస్తుతం బిఆర్ఎస్ లో అలజడి నేపథ్యంలో మరోసారి ట్రబుల్ షూటర్ పేరు తెరపైకి వచ్చింది. అతడు అధ్యక్షుడు అయితేనే పార్టీలో అలజడులు తగ్గుతాయన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే మేనల్లుడితో కేసీఆర్ తరచూ భేటీ కావడం, తాజాగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ బాధ్యతలు అప్పగించడం ద్వారా కొత్త సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి కేసీఆర్ ఏంచేస్తారో చూడాలిమరి.