చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి భీకర కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.
మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నిన్న(బుధవారం) భద్రతా దళాల కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మరిచిపోకముందే చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ అడవుల్లో మరోసారి మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఎన్కౌంటర్ లో ఐదుగురు మరణించినట్లు సమాచారం. అయితే ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం.
చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు భారీ టీమ్ తారసపడింది. దీంతో మావోలు, భద్రతా దళాలకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్(70) కన్నుమూసారు. ఆయనతో పాటు మొత్తం 27 మంది మావోయిస్టులు చనిపోగా ఓ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు చెందిన భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఏకే-47, ఎన్ఎల్ఆర్, ఇన్సాస్, కార్భైన్ ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యింది. ఈ ఎన్కౌంటర్ పై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు చత్తీస్ ఘడ్ సిఎం విష్ణుదేవ్ సాయి స్పందించారు. మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా సాగుతోందన్నారు. మావోయిస్టులే లేకుండా చేసేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని వారు స్పష్టం చేసారు.