2014 జూన్2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు గుడుస్తోన్న నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది.? దీని వెన‌కాల ఉన్న చారిత్ర నేప‌థ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

అనేక వాద‌న‌లు

తెలంగాణ అనే పేరుకు ఒకటి కాదు, పలు వాదనల ఆధారంగా వివిధ మూలాలు ఉన్నాయి. పదోత్పత్తి శాస్త్రం (Etymology) కోణంలోనూ, చారిత్రక వర్గీకరణ పరంగానూ, పురాణాల ఆధారంగా కూడా ఈ పేరుకు ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ఆ భిన్న కోణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిలింగ అనే ప‌దం నుంచి

ప్రముఖ చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు అభిప్రాయం ప్రకారం, తెలుగు నేల మొత్తం త్రిలింగాల మధ్య విస్తరించి ఉంది. అంటే మూడు లింగాల మ‌ధ్య ఉంద‌ని అర్థం. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం ఈ మూడు శైవ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని "త్రిలింగ దేశం" అని పిలిచేవారు. కాలక్రమంలో త్రిలింగ దేశం → త్రిలింగానం → తిలింగానా → తెలంగాణ అనే రూపాంతరమైనట్లు అభిప్రాయాలు ఉన్నాయి.

భాషా ప‌రంగా చూస్తే

భాషాపరంగా చూస్తే, "తిలింగ" లేదా "తెలింగ" అనే పదానికి "ఆనము" (ప్రదేశం) అనే శబ్దం జత కలిపితే "తిలింగానము" అనే రూపం వస్తుంది. ఇది కాలక్రమంలో "తెలంగాణ"గా మారిందని అంటారు. ఈ విధంగా చూస్తే ఇది శబ్ద పరిణామం (phonetic evolution)కి చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని చెబుతుంటారు.

ద్రావిడ మూలాలు

ఒక వాదన ప్రకారం, ద్రావిడ భాషల్లో "తెలుగు" అన్న పదానికి దక్షిణం అనే అర్థం ఉంటుంది. అలాగే "ఆనము" అంటే ప్రదేశం. కాబట్టి "తెలుగు + ఆనము" = "తెలంగాణ" అనే భావనకి భాషాపరంగా కొంతమేర ఆధారం ఉంది. ఇది భౌగోళిక దిశా ఆధారంగా వ‌చ్చిన ప‌దంగా చెప్పొచ్చు.

ముస్లిం చ‌రిత్ర‌కారుల ప్ర‌కారం

మహమ్మదీయ చరిత్రకారులు ఈ భూభాగాన్ని "తిలింగ్" అనే పేరుతో సంబోధించేవారు. ఆ సమయంలో స్థానిక ప్రజలను తైలంగులు, తిలింగులు, తెలంగులు అని పిలిచేవారు. ఈ పేర్లు కాలక్రమంలో తెలంగాణులుగా మారాయనే వాద‌న కూడా ఉంది.

పురాణాల్లోనూ ప్ర‌స్తావ‌న

స్కంద పురాణంలో త్రిలింగ దేశం ప్రస్తావన ఉంది. ఇందులో శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మధ్య భూభాగాన్ని త్రిలింగ దేశంగా పేర్కొన్నారు. వాయు పురాణంలో "తిలింగుల జనపదం" అనే పదబంధం ఉంది. నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోనూ త్రిలింగ ప్రాంతపు ప్రస్తావన ఉంది. ఈవన్నీ తెలంగాణ అనే పదం ప్రాచీనత, భౌగోళిక స్థితిని, పౌరాణిక ప్రస్తావనలను బలపరుస్తాయి.