కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు
సీట్ల సర్దుబాటులో మిత్రపక్షాలకు సీటు కేటాయించడం వల్లనో సామాజిక సమీకరణాలతో టికెట్టు దక్కని అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు నేరుగా రంగంలోకి దిగారు.
హైదరాబాద్: సీట్ల సర్దుబాటులో మిత్రపక్షాలకు సీటు కేటాయించడం వల్లనో సామాజిక సమీకరణాలతో టికెట్టు దక్కని అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా నామినేషన్ దాఖలు చేసిన రెబెల్స్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇలా అసంతృప్తులను బుజ్జగించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగడం ఇదే తొలిసారి.
ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు కలిసి మహాకూటమి(ప్రజా కూటమి)గా ఏర్పడ్డాయి.
మిత్రులకు కేటాయించిన స్థానాల్లో రెబెల్స్ గా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు బుజ్జగించారు. బుధవారం నాడు అర్ధరాత్రి అహ్మద్ పటేల్. జైరాం రమేశ్, డీకే శివకుమార్,జైపాల్ రెడ్డిలు కాంగ్రెస్ రెబెల్స్ ఇంటికి వెళ్లి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరారు.
బుధవారం నాడు అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రెబెల్స్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. శేరిలింగంపల్లి సీటును టీడీపీకి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కానీ ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు బిక్షపతి యాదవ్ చర్చించారు.
శేరిలింగంపల్లిలో రెబెల్గా నామినేషన్ దాఖలు చేసిన భిక్షపతి యాదవ్ను మంగళవారమే జైపాల్రెడ్డి కలిశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరితే ఆయన ససేమిరా అన్నారు. దాంతో బుధవారం రాత్రి ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు భిక్షపతి యాదవ్ ఇంటికి వెళ్లారు. నామినేషన్ను ఉపసంహరించుకోవాలని బుజ్జగించారు.
పొత్తులో భాగంగా భిక్షపతి యాదవ్కు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. భవిష్యత్తులో ఇంతకంటే ఉన్నతమైన స్థానం ఇచ్చి ఆయన్ను గౌరవిస్తాం. ఎలాంటి పదవి ఇస్తామో ఇప్పుడే చెప్పలేం. రేపటి నుంచి మహా కూటమి అభ్యర్థితో కలిసి ఆయన ప్రచారం చేస్తారని అహ్మద్ పటేల్ తెలిపారు.
మేడ్చల్ అసెంబ్లీ నుండి నామినేషన్ దాఖలు చేసిన జంగయ్య యాదవ్ తో మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ చర్చించారు. బుధవారం రాత్రి జైరామ్ రమేష్ జంగయ్య యాదవ్ తో సమావేశమయ్యారు. మేడ్చల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు కేటాయించింది. గురువారం నాడు నామినేషన్ ను ఉపసంహరించుకొంటామని జంగయ్య యాదవ్ తెలిపారు.
మల్కాజిగిరి నుంచి నామినేషన్ వేసిన సురేశ్ యాదవ్తో వీరప్ప మొయిలీ మాట్లాడారు. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఖైరతాబాద్ నుంచి నామినేషన్ తిరస్కరణకు గురైన రాజు యాదవ్.. తాను దాసోజు శ్రవణ్కు మద్దతుగా పనిచేస్తానని తెలిపారు.
సూర్యాపేటలో నామినేషన్ వేసిన పటేల్ రమేశ్ రెడ్డి కూడా ఉపసంహరణకు అంగీకరించారు. పొత్తుల్లో భాగంగా సనత్నగర్ సీటును కోల్పోయిన మర్రి శశిధర్ రెడ్డి నివాసానికీ జైరాం రమేశ్ వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
ఇప్పటికీ దారికి రాని నేతలతో పార్టీ అగ్రనేత అహ్మద్ పటేల్ గురువారం మాట్లాడుతారు. రెబల్స్ అందరూ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.
వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్రెడ్డి మెత్తబడ్డారు. రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడడంతో ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటూ టీడీపీ అభ్యర్థికి సహకరించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
వరంగల్ తూర్పులో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. బరి నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర అంగీకరించట్లేదు. టీజేఎస్ అభ్యర్థి గాదె ఇన్నయ్యను బరి నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై రవిచంద్ర ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు
రెబల్స్ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్
సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం
టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డికి కాంగ్రెస్ మద్దతు
రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్కు బుజ్జగింపులు
చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్
లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై