Hyderabad Regional Ring Road (RRR): హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగాన్ని 6 లైన్ల ఎక్స్ప్రెస్వేగా నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
RRR: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టులో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమికంగా నాలుగు లైన్ల ఎక్స్ప్రెస్వేగా రూపొందించిన ఉత్తర విభాగాన్ని ఆరు లైన్ల ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించేందుకు కేంద్ర రోడ్లు-రవాణా మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ప్రణాళికలో వచ్చిన తాజా మార్పుల ప్రకారం, ఈ మార్గాన్ని 6 లైన్లుగా నిర్మించి, భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుదల మేరకు 8 లైన్లకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పు నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఇప్పటికే ట్రాఫిక్ అధ్యయనాలు ప్రారంభించగా, గతంలో రూపొందించిన నాలుగు లైన్ల ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పుడు ఆరు లైన్లకు అనుగుణంగా సవరిస్తోంది.
RRR ఉత్తర విభాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకూ 161.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఈ విభాగానికి సంబంధించి NHAI 2024 డిసెంబరు 28న టెండర్లను ఆహ్వానించింది. ఈ రహదారి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.5,554.02 కోట్లు గా అంచనా వేశారు. మొదట టెండర్లు నాలుగు లైన్ల ప్రాజెక్టుకు ఇవ్వబడినప్పటికీ, ప్రస్తుత మార్పుల ప్రకారం కొత్త టెండర్లను పిలవకుండా, ఇప్పటికే దాఖలైన టెండర్లను మారిన డీపీఆర్కు అనుగుణంగా సవరించి మళ్లీ సమర్పించాలని ఏజెన్సీలకు సూచించనున్నారు.
ప్రాజెక్టు నిర్మాణ కాలవ్యవధి రెండు సంవత్సరాలు కాగా, ఐదు సంవత్సరాల నిర్వహణ కాలం కూడా ఇందులో భాగంగా ఉంది. ఆర్థిక-సాంకేతిక బిడ్ల గడువు 2025 ఫిబ్రవరి 14గా నిర్ణయించగా, టెండర్లను ఫిబ్రవరి 17న తెరచే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కేంద్రం ఆరు లైన్ల మార్పుపై దృష్టి సారించినందున దీనిపై తదుపరి నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశముంది. ప్రారంభ దశలో ఆర్ఆర్ఆర్ ను 8 లైన్ల రహదారిగా రూపొందించాలని భావించినా, అప్పటి ట్రాఫిక్ డేటాను ఆధారంగా తీసుకొని కేంద్రం నాలుగు లైన్లుగా ముందుకు సాగింది. అయితే, భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుదల దృష్ట్యా ఇప్పుడే ఆరు లైన్లగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇక, ఈ ఉత్తర విభాగానికి సంబంధించి భూముల సేకరణ దాదాపు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. భూ స్వాధీన ఖర్చు రాష్ట్రం-కేంద్రం సమానంగా (50:50) నిర్వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ విభాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయడం ప్రారంభించింది. ఈ పని కోసం ఇటీవలే ఒక ఏజెన్సీని నియమించింది. అయితే దక్షిణ విభాగ నిర్మాణాన్ని కేంద్రం చేపడుతుందా లేక రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.