తెలంగాణలో పోలీస్ అధికారుల సంఖ్య మరింత పెరగనుంది. రాష్ట్రానికి కేటాయించే ఐపిఎస్ ల సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత పెంచారో తెలుసా? 

Hyderabad : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రానికి మరింత ఎక్కువమంది ఐఎఎస్, ఐపిఎస్ లను కేటాయించాలన్న తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణకు మరింత ఎక్కువమంది ఐపిఎస్ లను కేటాయించేందుకు కేంద్రం సిద్దమయ్యింది... ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారిచేసింది.

తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ ల సంఖ్య ప్రస్తుతం 139 గా ఉంది. అంటే ఇప్పటివరకు ఆలిండియా లెవెల్ సివిల్ సర్విసెస్ లో ర్యాంకు సాధించి ఐపిఎస్ శిక్షణపొందిన బ్యాచ్ లోంచి ప్రతిఏడాది 139 మందిని కేటాయించేవారు. కానీ ఇకపై రాష్ట్రానికి మరింత ఎక్కువమంది ఐపిఎస్ లు రానున్నారు... మరో 12 మందిని పెంచి తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ ల సంఖ్యను 151 కి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇలా కేంద్రం కేటాయించిన ఐపిఎస్ లలో సీనియర్ డ్యూటీ 83, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ 33, స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ 20, ట్రైనింగ్ రిజర్వ్ 2, లీవ్ రిజర్వ్ లేదా జూనియర్ పోస్టుల రిజర్వ్ 13... ఇలా మొత్తం 151 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రమోషన్స్ ద్వారా 46, ప్రత్యక్ష నియామకం ద్వారా 105 మందిని భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టాక ఐపిఎస్ ల కొరతను గుర్తించారు... దీంతో తెలంగాణ కేటాయించే ఐపిఎస్ ల సంఖ్యను పెంచాలని కేంద్రానికి వరుస లేఖలు రాసారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన కేంద్రం 12 మంది ఐపిఎస్ లను తెలంగాణకు అదనంగా ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే రేవంత్ 29 మంది ఐపిఎస్ లను పెంచాలని కోరగా కేంద్రం మాత్రం సగంకంటే తక్కువమందినే కేటాయించింది.