తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. ఈ నగర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పురాతక కట్టడాలు దీని చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్నాయి. అందుకే ఈ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించాలని జయేష్ రంజన్ డిమాండ్ చేసారు.
Hyderabad : కుతుబ్ షాహీలు నిర్మించిన నగరం... నిజాంలు పాలించిన రాజ్యం... దాదాపు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రాంతం... ఈ హైదరాబాద్ వైభవం మాటల్లో వర్ణించలేనిది. చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే సంస్కృతి, సాంప్రదాయాలకు, పురాతన కట్టడాలకు నిలయం ఈ హైదరాబాద్. అందువల్లే దీన్ని యునెస్కో (United Nations Educational, Scientific and Cultural Organization) వారసత్వ నగరాల జాబితాలో హైదరాబాద్ లో చేర్చాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది.
తాజాగా తెలంగాణ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ తాజాగా ఇదే డిమాండ్ చేసారు. హైదరాబాద్ కు వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి... కాబట్టి దీన్ని యునెస్కో గుర్తించాలని ఆయన కోరారు. పురాతన సంస్కృతి, సాంప్రదాయాలు... ఆధునిక జీవన శైలి మిళితమైన అతి తక్కువ నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ కుతుబ్ షాహీలు, నిజాంల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాల ఆర్కిటెక్చర్ అద్భుతమన్నారు.
చార్మినార్ వంటి కట్టడాలు హైదరాబాద్ చారిత్రక వైభవాన్ని తెలియజేస్తాయని జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఇక ఫలక్ నుమా, చౌమహుల్లా ప్యాలస్ లు ఇప్పటికీ నిజాంల పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ ఈ నగర చరిత్రను తెలియజేస్తాయి. ఇలా ప్రాచీన కట్టడాలు, సరికొత్త సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ఈ పురాతన నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించాలని జయేష్ రంజన్ కోరారు.
ఇదిలాఉంటే గతంలో హైదరాబాద్ ను యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు కల్పించింది. దేశవ్యాప్తంగా కేవలం రెండు నగరాలు మాత్రమే యునెస్కో గుర్తింపు పొందగా అందులో హైదరాబాద్ ఒకటి. ఈ పురాతన నగరం విభిన్నమైన ఆహార పదార్థాల విభాగంలో యునెస్కో చేత గుర్తించబడింది. ముంబై సినిమా కేటగిరీలో ఎంపికయితే హైదరాబాద్ మత్రం గాస్ట్రోనమీ విభాగంలో క్రియేటివ్ సిటీగా ఎంపికయ్యింది.