తెలంగాణపై అమిత్ షా ఫోకస్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను తనలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ చేరికలు అన్నీ అమిత్ షా డైరెక్షన్ లో సాగుతున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది మొదటి నుంచే ఆయన రాష్ట్రానికి మూడు సార్లు వచ్చారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి షా కృషి చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి నాయకులను తీసుకొచ్చేందుకు ఆయన డైరెక్షన్ లోనే ప్లాన్ ల అమలు సాగుతోందని తెలుస్తోంది.
Munugode bypoll 2022: కెసిఆర్ పక్కా వ్యూహం, నేతలతో వరుస భేటీలు
ప్రతీ జిల్లాలో బీజేపీకి ఒక స్ట్రాంగ్ లీడర్ అండగా ఉండేలా చూసుకోవాలని, దాని కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర నాయకులకు అమిత్ షా సుమారు నెల రోజుల కిందట ఆదేశాలు ఇచ్చారని అర్థమవుతోంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సర్వే బృందాలు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆయనకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా సూచనలు చేస్తున్నారు.
‘ తెలంగాణ రాష్ట్రంలో అధిక మండలాల్లో బీజేపీకి కేడర్ ఉన్నప్పటికీ మంచి లీడర్ షిప్ లేదు. ఈ విషయం పలు సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోంది. అందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరిని సమన్వయకర్తగా నియమించాలి. ఈ విషయాన్ని మేము హైకమాండ్ కు చాలా రోజుల నుంచి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు దానికి అనుగుణంగా హైకమాండ్ చర్యలు తీసుకుంటోంది’ అని బీజేపీ కి చెందిన నాయకుడు తెలిపారని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో పేర్కొంది.
బీజేపీ ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకునేలా చూడాలని జాతీయ నాయకత్వం నుంచి సూచనలు వస్తున్నాయి. ఆ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కూడా అడుగులు వేస్తోంది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఇంటర్నల్ ఇష్యూస్ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా ఉమ్మడి నల్గొండ పరిధిలోకి వచ్చే మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ నెల 21వ తేదీన అధికారంగా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాతబస్తీలో కాల్పులు.. బల్లికి గురిపెట్టి బాలుడుని కాల్చాడు...
ఈ చేరిక సందర్భంగా తెలంగాణలో భారీ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి అమిషా వస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ బహిరంగ సభ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మరి కొందరు నాయకులు కూడా ఇదే సందర్భంగా బీజేపీలో చేరనున్నారు. ఇందులో దాసోజు శ్రవణ్, మాజీ టీఆర్ఎస్ లీడర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు.