Wines Closed : తెలంగాణలో రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్... అయినా మందుబాబులకు పండగే
నవంబర్ 28 సాయంత్రం నుండి పోలింగ్ రోజు అంటే 30వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్, బార్ లు మూతపడనున్నాయి.
![Telangana Assembly Elections 2023 ... wines and bars closed on November 28th evening to 30th evening in Telangana AKP Telangana Assembly Elections 2023 ... wines and bars closed on November 28th evening to 30th evening in Telangana AKP](https://static-ai.asianetnews.com/images/01dqp39cbeb91we7m0y88tfgct/images--4--jpg_363x203xt.jpg)
హైదరాబాద్ : తెలంగాణ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలింగ్ కు ముందే మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు వైన్స్ లను మూసివేయాలని ఈసి ఆదేశించింది.
నవంబర్ 28 సాయంత్రం నుండి పోలింగ్ రోజు అంటే 30వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్, బార్ లు మూతపడనున్నాయి. తమ ఆదేశాలను కాదని మద్యం అమ్మకాలు చేపడుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.
అయితే ఇలా పోలింగ్ కు మద్యం వైన్స్, బార్ల బంద్ వుంటుందని అందరికీ తెలుసు. దీంతో మందుబాబులు కూడా ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. ముందుగానే తమకు అవసరమైన మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ మూడురోజులు మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగనున్నాయి.
ఇక ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కూడా ఓటర్లను మభ్యపెట్టేందుకు మందు పంపిణీ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇది మరీ ఎక్కవగా వుండనుంది. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. ఈ మూడురోజులు మద్యం విక్రయాలు మరింత ఎక్కువగా వుండనున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు వీలైనంత ఎక్కవుగా మద్యం కొనుగోలు చేసుకుని రహస్యంగా పంపిణీ చేయనున్నారు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.
ఇప్పటికే ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం తగ్గించేందుకు ఎలక్షన్ కమీషన్, పోలీసులు చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల బార్డర్లతో పాటు కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ చేపట్టారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరినీ చూడకుండా వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వందలకోట్ల డబ్బు, కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయి.
పోలింగ్ కు కేవలం మూడునాలుగు రోజుల సమయం మాత్రమే వుంది... దీంతో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను తెరలేపనున్నారు అభ్యర్థులు. తమకే ఓటే వేయాలంటూ డబ్బులు ఇవ్వడమే కాదు మద్యం తాగేవారికి ఉచితంగా బాటిల్స్ ఇస్తుంటారు. ప్రచారంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు మందుపార్టీలు చేసుకుంటారు. ఇలా ఎన్నికల సీజన్ లో మందుకు మంచి గిరాకీ వుంటుంది.