Telangana Assembly Elections 2023: పెద్ద ఎత్తున బెట్టింగ్, చేతులు మారుతున్న కోట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పంటర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ పెడుతున్నారు.
![Telangana Assembly Elections 2023: Punters bet big on Telangana Elections lns Telangana Assembly Elections 2023: Punters bet big on Telangana Elections lns](https://static-ai.asianetnews.com/images/01hca2y14mdczw4pamxbh0m1vb/election-1_363x203xt.jpg)
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీకి గురువారం నాడు (నవంబర్ 30) పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగింది. అయితే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయమై బెట్టింగ్ రాయుళ్లు పందెం నిర్వహిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
కామారెడ్డి, గజ్వేల్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశంతో పాటు ఇతర జిల్లాల్లో కూడ బెట్టింగ్ సాగుతుందనే ప్రచారం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో రెండింటిలో విజయం సాధిస్తాడా, లేక ఒక్క నియోజకవర్గంలోనే గెలుస్తాడా అనే విషయమై బెట్టింగులు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని తెలుగు ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో కూడ ఈ తరహా బెట్టింగ్ సాగుతుందనే ప్రచారం లేకపోలేదు.
నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు, మెజారిటీలపై బెట్టింగులు సాగుతున్నాయని ప్రచారంలో ఉంది. మరో వైపు గజ్వేల్ , హుజూరాబాద్ లలో ఈటల రాజేందర్ ఏ నియోజకవర్గంలో విజయం సాధిస్తారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లను సాధిస్తారనే విషయమై బెట్టింగ్ రాయుళ్లు పందెం కాస్తున్నారు. దీనికి తోడు కామారెడ్డి, గజ్వేల్ లలో కేసీఆర్ మెజారిటీ, గెలుపు ఓటములపై కూడ బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై కూడ బెట్టింగ్ సాగుతుంది. కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంటుందా, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా, బీజేపీ బోణి కొడుతుందా అనే విషయమై పందెంరాయుళ్లు బెట్టింగ్ పెడుతున్నారు.
ఒక్కటికి రెండింతలు అంటూ పందెంరాయుళ్లు పందెం కాస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ ల తరహాలోనే ఈ ఎన్నికలకు సంబంధించి కొందరు బెట్టింగ్ రాయుళ్లు యాప్ లను ఉపయోగిస్తున్నారనే చర్చ కూడ లేకపోలేదు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయాలు బెట్టింగ్ లో చేతులు మారుతుందనే జోరుగా విన్పిస్తుంది. పోలింగ్ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి.