Congress CM Race : ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పులేదే..!: భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగా వీస్తోందని... 70 నుండి 85 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు.
![Congress leader Bhatti Vikramarka interesting comments on Telangana CM post AKP Congress leader Bhatti Vikramarka interesting comments on Telangana CM post AKP](https://static-ai.asianetnews.com/images/01gzxnfvt0snqrmc7kw8eaqehx/mallu-bhatti-vikramarka--2--jpg_363x203xt.jpg)
ఖమ్మం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో బిఆర్ఎస్ ను ఓడిస్తామని చెబుదున్న కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో వుంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేదెవరు? ఇప్పుడు దీనిపైనే ఆ పార్టీ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చ సాగుతోంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్లు ఈ పదవిని ఆశిస్తున్నారు. పలు సందర్భాల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్లు ముఖ్యమంత్రి అభ్యర్థి తామే అనేలా మాట్లాడారు. ఈ క్రమంలో తాజాగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో గెలిచిన ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని ఆశించడంలో తప్పులేదు... ఎమ్మెల్యేగా వారికి ఆ అర్హత ఉంటుందన్నారు. కానీ పార్టీ అధిష్టానం గెలిచిన ఎమ్మెల్యే, ఇతర నాయకులు ఇలా అందరి అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటారని... ఎవరిని సీఎం చేసినా మిగతావారిని మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా పాలనాపరమైన నిర్ణయాలు సమిష్టిగానే వుంటాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో, తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయని భట్టి విక్రమార్క అన్నారు.
Read More ముడతల చొక్కా.. అరిగిన చెప్పులు , గుర్తున్నాయా : కేసీఆర్, కేటీఆర్లపై బండి సంజయ్ సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగా వీస్తోందని... 70 నుండి 85 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమన్నారు భట్టి విక్రమార్క. మధిరలోనూ తాను మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని అన్నారు. బిఆర్ఎస్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో వున్న ప్రజానీకం కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుని గెలిపించనున్నారని... వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందిస్తామని భట్టి తెలిపారు.
తెలంగాణను ఎంతో పోరాడి సాధించుకున్నాం... కానీ బిఆర్ఎస్ పదేళ్ళ పాలనలో స్వరాష్ట్ర ఆశయాలేవీ నెరవేరలేదని భట్టి అన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అవినీతి, అక్రమాలతో లక్షలకోట్లకు పడగలెత్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల అవినీతిపై దర్యాప్తు చేయిస్తామని భట్టి వెల్లడించారు.